కరెంటు ఉత్పత్తి కంటే కొనడమే ఎక్కువైంది

కరెంటు ఉత్పత్తి కంటే కొనడమే ఎక్కువైంది

రోజూ కరెంట్ కొనడానికే దాదాపు 100 కోట్లు

రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉత్తమాటే

తెలంగాణలో రోజువారీ వాడకం: 260 మిలియన్యూనిట్లు

జెన్ కో ఉత్పత్తి చేస్తున్నది: 80 మిలియన్ యూనిట్లు

రోజువారీగా కొంటున్నది: 180 మిలియన్ యూనిట్లు

 

హైదరాబాద్‌‌, వెలుగు:  విద్యుత్‌ రంగంలో దూసుకుపోతున్నామని రాష్ట్ర సర్కారు చెప్తున్నా.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కరెంటు ఉత్పత్తి కంటే.. కొనుడే ఎక్కువగా ఉంటోంది. ఐదేండ్ల కిందట ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణ పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. మరోవైపు శ్రీశైలం జల విద్యుత్‌ ప్రాజెక్టు ప్రమాదంతో కరెంట్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఏడు నెలలు అవుతున్నా రెండు యూనిట్లలో రిపేర్లు ఇంకా పూర్తికాలేదు. ఇలా మన పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి పెంపు గురించి పట్టించుకోని రాష్ట్ర సర్కారు.. బయటి నుంచి కొనడంపైనే దృష్టిపెడుతోంది. దీంతో కరెంటు కొనుగోళ్ల కోసమే సగటున రోజూ రూ.80 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎండలు పెరిగి, కరెంటు వాడకం ఎక్కువైతే ఈ మొత్తం 100 కోట్లకు చేరే అవకాశం ఉంది.

మూడు రెట్లు ఎక్కువ

ఈ నెల ప్రారంభం నుంచి రోజువారీగా 255 మిలియన్‌‌ యూనిట్ల నుంచి 269 మిలియన్‌‌ యూనిట్లకు పైగానే కరెంటు వాడకం జరుగుతోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కరెంట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా బయటి నుంచి కొంటున్నారు. ఈ నెల 11న అత్యధికంగా 269.79 మిలియన్ యూనిట్లు వాడగా, 12న 266.07 ఎంయూలు, 13న  262.94 ఎంయూలు, 14న  260.93 ఎంయూలు, 15న 267.38 ఎంయూల విద్యుత్‌‌ వాడకం జరిగింది. కానీ జెన్‌‌కో థర్మల్‌‌, హైడల్‌‌ పవర్‌‌ ప్లాంట్లు అన్నీ కలిపి గత ఐదు రోజుల్లో డైలీ 77.48 ఎంయూల నుంచి 83.12 ఎంయూల వరకే కరెంటు ఉత్పత్తి చేశాయి.  దీంతో నాలుగు రోజులుగా సింగరేణి నుంచి 13.20 ఎంయూల నుంచి 17.20 ఎంయూల వరకు, నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ (ఎన్‌సీఈ) సంస్థల నుంచి 27.54 ఎంయూల నుంచి 30.89 ఎంయూల వరకు ట్రాన్స్కో కొన్నది. సెంట్రల్‌ పవర్ జనరేషన్‌ స్టేషన్ల నుంచి 141.04  ఎంయూల నుంచి 153.99 ఎంయూల వరకు కొన్నది. జెన్‌కో నుంచి కాకుండా ఇలా ఇతర సంస్థల నుంచి ఐదు రోజుల్లో రోజువారీగా 181 ఎంయూలు నుంచి 198 ఎంయూల వరకు కరెంట్ను ట్రాన్స్‌కో కొని సరఫరా చేసింది. ఈ లెక్కన రాష్ట్రంలో మిగులు విద్యుత్ అన్నది ఉత్తమాటే.

డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేదు

ఎండాకాలం కావటంతో రాష్ట్రమంతటా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పుంజుకుంటోంది. దీంతో కరెంట్ డిమాండ్అంతకంతకూ పెరుగుతోంది. కానీ రాష్ట్రంలో ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి కావటం లేదు. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి సగటున రోజూ 180 మిలియన్‌ యూనిట్లకు పైగా కరెంటును జెన్కో కొంటోంది. యావరేజీగా ఒక యూనిట్విద్యుత్ కొనాలంటే రూ.4.4 నుంచి రూ.5.4 ఖర్చవుతుంది. సరఫరా ఖర్చు అదనం. ఈ లెక్కన రోజూ అంత భారీ మొత్తంలో కరెంట్ కొనాలంటే రూ.80 కోట్ల నుంచి దాదాపు రూ.100 కోట్లు ఖర్చవుతోంది.

శ్రీశైలం ప్రమాదంతో మరింత ఎఫెక్ట్‌

శ్రీశైలం జల విద్యుత్‌ ప్రాజెక్టు ప్రమాదంతో జెన్‌కో ఉత్పత్తి మరింత తగ్గింది. గత ఆగస్టు 20న 900 మెగావాట్ల శ్రీశైలం ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం జరగడంతో జెన్‌కో హైడల్‌ పవర్‌పై ఎఫెక్ట్‌ పడింది. రోజూ 21.6 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు నుంచి హైడల్‌ పవర్‌ జనరేషన్‌ తగ్గింది. 6 యూనిట్లలో 2 యూనిట్లు భారీగా దెబ్బతినగా, మిగతా 4 యూనిట్లను తిరిగి ప్రారంభించారు. అయినా రోజుకు ఒక్క మిలియన్ యూనిట్‌ ఉత్పత్తికే కష్టమవుతోంది.

ఐదేండ్లయినా పూర్తికాని యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లు

యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల పనులు మొదలుపెట్టి ఐదేండ్లవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. భద్రాద్రి ప్లాంట్‌‌ పనులు చివర్లో ఉండగా, యాదాద్రి ప్లాంట్ నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. యాదాద్రి ప్లాంట్ అందుబాటులోకి రావడానికి మరో మూడేండ్లు పడుతుందని జెన్‌‌కో వర్గాలు చెప్తున్నాయి. 4,000 మెగావాట్ల యాదాద్రి ప్లాంట్‌‌, 1,080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభమైతే రోజూ 180 మిలియన్‌‌ యూనిట్ల విద్యుత్‌‌ అందుబాటులోకి వస్తుంది. అదే జరిగితే కరెంట్ కొనుగోలు నుంచి కొంత బయటపడొచ్చని పవర్ సెక్టార్ ఎక్స్పర్టులు అంటున్నారు.

రికార్డు స్థాయిలో ఇస్తున్నం

గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రాష్ట్రంలో కరెంటు సరఫరా చేస్తున్నాం. రోజు వారీగా 13 వేల మెగావాట్ల వరకు డిమాండ్‌‌ ఉంటోంది. రోజూ యావరేజీగా రూ.3.28 నుంచి రూ.4.40 దాకా సెంట్రల్‌‌ ఎక్సేంజీ నుంచి కొని అత్యధికంగా 13,527 మెగావాట్ల రికార్డు డిమాండ్‌‌ వచ్చినా సరఫరా చేయగలిగాం. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో కరెంటు అవసరాలు తీరుస్తున్నం. - ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో  సీఎండీ ప్రభాకర్‌‌రావు.