
- రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టివేత
వంగూరు, వెలుగు: కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో విద్యుత్ శాఖ లైన్మెన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలం మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.4,900 చొప్పున 4 డీడీలు కట్టాడు. కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఇవ్వమని లైన్మెన్ నాగేందర్ ను రైతు కోరగా, రూ.20 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్ ఫార్మర్, పోల్స్ ఇస్తానని చెప్పడంతో రూ.15 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు.
ఆ తరువాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం లైన్మెన్ నాగేందర్ కు రూ.15 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్నారు. నాగేందర్ను బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామని డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ లింగస్వామి, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్లలో రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్..
రాజన్నసిరిసిల్ల: సిరిసిల్లలో లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 123లో ఇరుకుల్ల ప్రవీణ్కు చెందిన మూడెకరాల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్ వేణు రూ.30 వేలు డిమాండ్ చేశాడు. సర్వే చేయాలంటే ముందుగా రూ.10 వేలు చెల్లించాలని, సర్వే అయ్యాక రూ.20 వేలు ఇవ్వాలని షరతు విధించాడు.
దీంతో రైతు ప్రవీణ్ సర్వేకు ముందే రూ. 10 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.20 వేలు ఇవ్వాలని వేధించడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం రూ.20వేలు ఇవ్వగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.