
- ఐఈఎక్స్లో కరెంటు కొనుగోళ్లు బంద్
- రాష్ట్రానికి కావాల్సిన 20 మిలియన్ యూనిట్ల పర్చేజ్కు బ్రేక్
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) నుంచి కరెంటు కొనుగోలు చేయకుండా రాష్ట్ర విద్యుత్ కంపెనీలపై కేంద్రం నిషేధం విధించడంతో శుక్రవారం రోజున కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో 20 మిలియన్ యూనిట్ల కరెంటును కొనుగోలు చేయలేకపోయామని రాష్ట్ర విద్యుత్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల విద్యుత్ సంస్థల నుంచి బకాయిలు రాకపోవడంతో కేంద్రం ఎక్స్చేంజీ పవర్ పర్చేజ్ని నిలిపివేసింది. దీంతో 6 రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలు బాకీలు చెల్లించడంతో ఐఈఎక్స్ ద్వారా కరెంటు కొనుగోళ్లకు అనుమతి లభించింది.
తెలంగాణతో పాటు 7 రాష్ట్రాల విద్యుత్ సంస్థలు బాకీలు చెల్లించలేదని ఐఈఎక్స్నుంచి ఆ రాష్ట్రాల కొనుగోళ్లకు బ్రేక్ పడింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. బకాయి ఉన్న రాష్ట్రాలో తెలంగాణ టాప్లో ఉన్నట్లు తేల్చాయి. శుక్రవారం నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు లేఖ రాసి వివరాలు అందించినట్లు రాష్ట్ర విద్యుత్ వర్గాలు తెలిపాయి. కొనుగోళ్లు, సరఫరా తదితర లెక్కల్లో రూ.52.86 కోట్లు తెలంగాణ విద్యుత్ సంస్థలు బాకీ పడినట్లు తేలిందని ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. చెల్లించాల్సిన బాకీ రూ.1308 కోట్ల నుంచి రూ.52.86 కోట్ల వరకు తగ్గినట్లు చెప్తున్నా.. కరెంటు కొనుగోళ్లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం గమనార్హం.
బాకీలు చెల్లించిన రాష్ట్రాలివే..
ఆంధ్రప్రదేశ్ రూ. 412 .69 కోట్లు, మహారాష్ట్ర రూ. 381.66 కోట్లు, చత్తీస్గఢ్ రూ. 274కోట్లు, జార్ఖండ్ రూ. 214.47 కోట్లు, బీహార్ రూ.173.53 కోట్లు, మణిపూర్ 29.94 కోట్లు బాకీలు చెల్లించి ఐఈఎక్స్ ద్వారా కరెంటు కొనుగోళ్లకు క్లియెరెన్స్ పొందాయి.
రాష్ట్రంలో హైడల్ పవర్తో తప్పిన ముప్పు
రాష్ట్రంలో రోజువారీగా విద్యుత్ ఉత్పత్తి 100 మిలియన్ యూనిట్లు దాటుతోంది. అయితే తక్కువ ధరకు అందుబాటులో ఉండే జల విద్యుత్ నుంచి రోజువారీగా 45 మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పత్తి అవుతోంది. తాజాగా ఎనర్జీ ఎక్సేంజ్ నుంచి కొనుగోళ్లను నిలిపివేయడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన హైడల్ పవర్ ఆదుకుంది. లేదంటే కొనుగోళ్లకు కష్టమై రాష్ట్రంలో కరెంటు సరఫరాకు ఇబ్బందులు వచ్చేవని, ఇది ఇలాగే కొనసాగితే పవర్ కట్లు తప్పేలా లేవని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి.