తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేశాయి. శ్రీగంధం వనం వద్ద టీటీడీ ఏర్పాటు వేసిన ఫెన్సింగ్ని ధ్వంసం చేశాయి. పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చాయి. ఆ సమయంలో పాపవినాశనం రోడ్డులో భక్తుల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు.
తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. శ్రీగంధం వనం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ఏనుగులు ధ్వంసం చేసాయి. ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని టీటీడీ డిఎఫ్ఓ ,ఇతర ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. ఏనుగుల కారణంగా వాహన చోదకులకు, భక్తులకు అపాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ తెలిపారు. ఇక ఏనుగుల సంచారంతో అటవీ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు.