
ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత రోజుకో నిర్ణయంతో సంచలనం సృష్టిస్తున్న అధినేత ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విట్టర్ ప్రక్షాళన జరుగుతుందని ప్రకటించారు. ఇందులో భాగంగా ట్విట్టర్లో స్పామ్ , స్కామ్ అకౌంట్లను తొలగిస్తామని చెప్పారు. దీంతో ప్రముఖులు తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గడాన్ని గమనించాలని సూచించారు. అలాగే ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ ను 280 నుండి 1000కి పెంచాలని మస్క్ యోచిస్తున్నాడు. క్యారెక్టర్ లిమిట్ విషయంలో మస్క్ ఎప్పుడు మార్పులు చేస్తారో చూడాలి.
ఇప్పటికే బ్లూటిక్ వెరిఫికేషన్ పొందే యూజర్ల దగ్గరి నుంచి ప్రతి నెలా ఛార్జి వసూలు చేస్తామని ప్రకటించిన మస్క్ .. రేపటి నుంచి అకౌంట్ వెరిఫికేషన్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. అయితే ఇప్పటికే బ్లూ చెక్ మార్క్ పొందిన యూజర్లు మరోసారి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్లూ చెక్ మార్క్ పొందడానికి అర్హులు కాదనుకుంటే వారి అకౌంట్ ఫ్రొఫైల్ నుంచి బ్లూ టిక్ తొలగిస్తారు. అలాగే బ్లూ టిక్ ఒకటే కాకుండా..ప్రైవేట్ సంస్థలకు గోల్డ్ కలర్, ప్రభుత్వ సంస్థలకు గ్రే కలర్, వ్యక్తిగత అకౌంట్లకు బ్లూ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ భావిస్తోంది.