- ఇరిగేషన్ నుంచి మురళీధర్ ఔట్
- రాజీనామా చేయాలని ఈఎన్సీకి మంత్రి ఉత్తమ్ ఆదేశం
- రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు టర్మినేషన్
- విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు
- అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇరిగేషన్ శాఖ ప్రక్షాళన
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్మెంట్నుంచి ఈఎన్సీ (జనరల్) మురళీధర్ను ప్రభుత్వం తప్పించింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆయనను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు బాధ్యుడిగా గుర్తించి ఆయనపై చర్యలు చేపట్టారు. రామగుండం ఈఎన్సీగా కొనసాగుతున్న నల్ల వెంకటేశ్వర్లును ఉద్యోగం నుంచి టర్మినేట్చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపించింది. ఆ నివేదిక ఆధారంగానే పదేండ్లకు పైగా ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న మురళీధర్పై ప్రభుత్వం వేటు వేసింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే బుధవారం రాత్రి ఈఎన్సీ (జనరల్)తో పాటు మరో ఈఎన్సీపై చర్యలు తీసుకుంది. గత బీఆర్ఎస్ప్రభుత్వం రూ.95 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధర్ మాస్టర్ మైండ్గా వ్యహరించారన్న ఆరోపణలున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిమాండ్లు ఉన్నాయి. అయితే, విజిలెన్స్ నివేదిక కోసం ఎదురు చూసిన ప్రభుత్వం, ఆ నివేదిక అందడంతో తాజాగా చర్యలు తీసుకుంది.
వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసిన మేడిగడ్డ బ్యారేజీ మూడేండ్లకే కుంగిపోవడాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు మేడిగడ్డను సందర్శించి డ్యామేజీలను పరిశీలించారు. విజిలెన్స్నివేదికలో ఇంజనీర్లు ముఖ్యంగా మురళీధర్, నల్ల వెంకటేశ్వర్లు పాత్ర, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పేర్కొనడంతో చర్యలు చేపట్టారు. అసెంబ్లీ బడ్జెట్సమావేశాల్లో ఇరిగేషన్డిపార్ట్మెంట్పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వీరిద్దరితో పాటు మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన ఇతర అధికారులు, ఇంజనీర్లపైనా త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించాయి.
రిటైర్ అయినా.. పదేండ్లు పొడిగింపు
ఉమ్మడి ఏపీలోనే 2013, జూన్ 30న ఇరిగేషన్ ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. 2014, జూన్2న తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి ఆయన పదవీకాలాన్ని 2019 వరకు ఏటా పొడి గిస్తూ వచ్చారు. 2019, జూన్29న తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనే ఈఎన్సీగా కొనసాగుతారని జీవో నం.257 జారీ చేశారు. రిటైర్ అయిన తర్వాత కూడా పదేండ్ల ఏడు నెలల పాటు ఆయన ఇరిగేషన్కు సుప్రీంగా కొనసాగారు.
కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్ స్కీం రీడిజైన్లతో పాటు అనేక ప్రాజెక్టుల క్లియరెన్స్లు, ఇతర విషయాల్లో కీలకంగా పని చేశారు. నల్ల వెంకటేశ్వర్లు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ (సీఈ)గా 2019 మార్చి 31న రిటైర్ అయ్యారు. ఆతర్వాత ఆయనను ఈఎన్సీగా ప్రమోట్ చేసి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. గతేడాది ఇచ్చిన ఎక్స్టెన్షన్ ఉత్తర్వులు ఈ ఏడాది మార్చి నెలాఖరు వర కు ఉన్నాయి. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు వెంకటేశ్వర్లును టర్మినేట్ చేస్తూ బుధవారం రాత్రి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక ఆధారంగానే ఆయనను టర్మినేట్ చేస్తున్నామని, ఆ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఆ స్థానంలో మరొకరిని నియమించడానికి ఈఎన్సీ (అడ్మిన్) ప్రతిపాదనలు పంపాలని సూచించారు.