
వాషింగ్టన్: భారత ప్రధానిగా నరేంద్రమోడీ తిరిగి ఎన్నికైన తర్వాత రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంపై అమెరికా స్పందించింది. దక్షిణాసియాలో శాంతి కొనసాగాలంటే ఆ బాధ్యత పాక్పైనే ఉందని, టెర్రర్ గ్రూపులను పాకిస్థాన్ దూరం పెడితేనే అది సాధ్యమవుతుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. కాశ్మీర్ సహా అన్ని అంశాలనూ చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్.. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి రెండు లేఖలు రాశారు. చర్చలకు ముందుకు వస్తే ఇరు దేశాల్లో పేదరికాన్ని పారద్రోలడంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి కలసి పనిచేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అయితే పాక్ ఆఫర్ను ఇండియా తిరస్కరించింది. టెర్రరిస్టులు, చర్చలు ఒకేసారి కొనసాగలేవని, కిర్గిస్థాన్లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ సమ్మిట్(ఎస్ సీవో)లోనూ రెండు దేశ ప్రధానుల సమావేశం ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు టెర్రరిస్టులను అరెస్ట్ చేసి, వారిని ప్రాసిక్యూట్ చేయాలని, దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు, కార్యకలాపాలు నిర్వహించేందుకు వారికి అనుమతి ఇవ్వొద్దని, ఆయుధాలతో భారత్లో చొరబడి దాడులకు పాల్పడటాన్ని అడ్డుకోవాలని వైట్హౌస్లోని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు కళ్లెం వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, టెర్రరిస్టు సంస్థలు కార్యకలాపాలు నిర్వహించినంత కాలం.. ఇండియా–-పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొనడం అసాధ్యమని చెప్పారు. అందువల్ల శాంతిని కొనసాగించాల్సిన బాధ్యత పాక్పైనే ఉందని, అందువల్ల టెర్రర్ సంస్థలను నేలమట్టం చేస్తామని నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఆ దేశంపైనే ఉందని తెలిపారు.