
అనగా అనగా మహిలా రోప్యం అనే ఒక పట్టణం. ఆ పట్టణం అవతల ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. కొమ్మలు బాగా పెరిగి ఊడలు దిగి ఆ మర్రిచెట్టు బలంగా ఉండేది. దూరం నుంచి చూస్తుంటే ముచ్చటగా కనిపించేది. ఆ మర్రిచెట్టుపై ఎన్నో కాకులు గూళ్లు కట్టుకుని ఉంటుండేవి.
మేఘవర్ణుడు అనే రాజు ఆ కాకులను పాలించేవాడు.ఆ మర్రిచెట్టుకి సమీపంలోని ఒక కొండకింద ఒక గుహ ఉండేది. ఆ గుహలో ఎన్నో గుడ్లగూబలు నివసించేవి. ఆ గుడ్లగూబలను పరిపాలించే రాజు పేరు అధిమర్దనుడు. చీకటి పడగానే మర్రిచెట్టుపైన ఉన్న కాకుల్ని పొడిచి చంపేవాడు గుడ్లగూబల రాజు. అలా కాకులు నశించిపోతున్నాయి.
గుడ్లగూబల రాజు చేస్తున్న అరాచకం భరించలేని కాకులు తమ గోడును తమ రాజైన మేఘవర్ణుడి దగ్గర చెప్పుకున్నాయి. కాకుల రాజు తన మంత్రులను పిలిపించి... రాత్రుళ్ళు మనకు సరిగా కనబడదు. ఆ గుడ్లగూబల రాజుకు బాగా కనిపిస్తుంది. దాంతో అది మన కాకుల్ని చంపేస్తోంది. దాని పీడ విరగడవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి.. అని అడిగాడు..
కాకుల రాజు దగ్గర ఉజ్జీవనుడు, సంజీవి, అనుజీవి, ప్రజాజీవి, చిరంజీవి, స్థిరజీవి అనే మంత్రులు ఉన్నారు. గుడ్లగూబల రాజు దగ్గర రక్తాక్షుడు, ప్రాకారకర్ణుడు అనే మంత్రులు ఉన్నారు. కాకుల మంత్రి అయిన స్థిరజీవి తను శత్రువుతో స్నేహం చేసి శత్రువుని నాశనం చేస్తానని చెప్పింది. ఆ మాటలు విన్న కాకులన్నీ ఆశ్చర్యపోయాయి. కాకుల రాజు మాత్రం అందుకు అంగీకరించాడు.తరువాత రోజు స్థిరజీవి అనే కాకి, కొండ కింద ఉన్న గుహ వద్దకు వెళ్ళింది. గుడ్లగూబ రాజు కాకిని బంధించి, చంపబోతాడు.
అప్పుడు స్థిరజీవి గుడ్లగూబల రాజుతో పాడు జన్మపొందాను. నాకీ కాకి జన్మ ఇష్టంలేదు. వచ్చే జన్మలోనైనా మీలా గుడ్లగూబలా జన్మించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తాను.. అని చెప్తుంది. దాంతో గుడ్లగూబల రాజు అరిమర్దనుడు తన మంత్రులైన రక్తాక్షుడిని, ప్రాకార కర్ణుడిని ...ఈ కాకిని నమ్మాలా వద్దా?...అని సలహా అడిగాడు.
శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు కాబట్టి నమ్మవచ్చు అన్నాడు ప్రాకార కర్ణుడు.నమ్మొద్దు... అన్నాడు రక్తాక్షుడు. చివరికి గుడ్లగూబ రాజు ప్రాకార కర్ణుడి మాట విశ్వసించి కాకితో స్నేహం చేసాడు.కాకి ఎంతో నమ్మకంగా గుడ్లగూబతో స్నేహం చేసింది. వాళ్ళ నమ్మకాన్ని పొందింది. ఇలా కొంతకాలం గడిచింది.పగలు కళ్ళు కనిపించవు కాబట్టి గుడ్లగూబలు గుహలోపల పడుకుని ఉంటాయి. అలాగే ఒకరోజు ఉదయం గుడ్లగూబలన్నీ గుహలోపల పడుకుని ఉన్నాయి.
స్థిరజీవి అనే ఈ కాకి గూడు కట్టుకోవడం కోసం అన్నట్టు మెల్లగా ఎండుపుల్లలను తెచ్చి ఆ గుహముందు. ఎవరూ చూడకుండా గోడలా కట్టింది. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని కాకుల రాజు మేఘవర్ణుడికి చెప్పింది. శత్రువుని తుదముట్టించడానికి ఇదే సరైన సమయం అని సూచించింది.
కాకుల రాజు మేఘవర్ణుడు కొరివి పట్టుకొని పోయి గుహముందున్న కట్టెపుల్లలు గుట్టలోకి వేశాడు. ధగధగమని మండింది. ఈ దెబ్బతో గుహలోని గుడ్లగూబలన్నీ చనిపోయాయి. కాకుల రాజు తన మంత్రి అయిన స్థిరజీవిని ఎంతో మెచ్చుకున్నాడు.ఇలా శత్రువును నమ్మించి వారిలో ఒకరిగా కలిసిపోయి, వారిని మట్టుపెట్టడం ఓ యుద్ధ తంత్రము.
–వెలుగు,లైఫ్–