- అందుకే కాళేశ్వరం, మిషన్భగీరథకు తీరని నష్టం: జీవన్రెడ్డి
- ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్ సరిపోదు: మధుసూదనచారి
- టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినం: మహేశ్ కుమార్ గౌడ్
- విద్యా వ్యవస్థను గత సర్కార్ భ్రష్టు పట్టించింది: బల్మూరి వెంకట్
- మండలిలో బడ్జెట్పై చర్చ
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం, మిషన్ భగీరథలో ఇంజనీర్లు తప్పు చేశారని.. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పెద్దలు చెప్పిందానికి తలూపి ప్రజాధనానికి నష్టం కలిగించిన వారిని ఉరి తీయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం కౌన్సిల్లో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం నెర్రెలు వారడానికి ఇంజనీరింగ్ అధికారుల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కొద్ది మంది మొప్పు కోసం పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీ చేయాలె : మధుసూదనచారి
ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనచారి కోరారు. బుధవారం మధ్యంతర బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం రాక ముందుకు 4వేల మెగావాట్లు ఉన్న వి ద్యుత్ కెపాసిటీ ఇప్పుడు 18వేల మెగావాట్లకు చేరింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రతిపాదించిన బడ్జెట్ ఎంత మాత్రం సరిపోదన్నారు. మంత్రులు తుమ్మల, సీతక్క జోక్యం చేసుకుని విమర్శలు తగదని, ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని చెప్పారు.
నిరుద్యోగులకు అన్యాయం : బల్మూరి వెంకట్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సభ్యుడు బల్మూరి వెంకట్ విమర్శించారు. పదేండ్లలో విద్యావస్థను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు.
ఏడేండ్లు డీఎస్సీ వేయలేదు : ఏవీఎన్ రెడ్డి
గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసిందని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ప్రైమరీ స్కూళ్ల నుంచి యూనివర్సిటీ వరకు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఏడేండ్లుగా డీఎస్సీ నిర్వహించలేదని విమర్శించారు.
మండలానికో తెలంగాణ
పబ్లిక్ స్కూల్ : మహేశ్ కుమార్ గౌడ్
ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. రూ.500కోట్లు కేటాయించిందని కాంగ్రెస్ సభ్యుడు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అధికారం చేపట్టగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్ను నియమించామని పేర్కొన్నారు.
సర్కార్స్కూళ్లను
బలోపేతం చేయాలి : అలుగుబెల్లి
మండలానికే పరిమితం కాకుండా పట్టణాల్లో, నగరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయా లని అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. కొత్త జిల్లాలకు డీఈవోలను, మండలాలకు ఏంఈవోలను నియమించాలన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ను బలో పేతం చేయాలన్నారు. దుబారా ఖర్చులను తగ్గించు కుంటే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయవచ్చని తెలిపారు. మజ్లిస్ సభ్యుడు మీర్జా రహమత్ బేగ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేయడం అభినందనీయమన్నారు. బస్సుల్లో స్టూడెంట్లకు ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.