
- భయాందోళనకు గురవుతున్న స్థానికులు
- చిరుతను పట్టుకోవాలని అధికారులకు వేడుకోలు
లింగంపేట, వెలుగు : లింగంపేట, గాంధారి మండలాల సరిహద్దు గ్రామాలైన కంచ్మల్ సీతాయిపల్లి అటవీప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా చిరుత రోడ్డుపై తిరుగుతుండడంతో వాహనదారులు సెల్ఫోన్లలో ఫొటోలు తీసి సోషల్మీడియాలో వైరల్ చేశారు. మండలంలోని జల్దిపల్లి, భవానీ పేట, రాంపూర్, ముంబాజీపేట, కొండాపూర్, కంచ్మల్ గ్రామాలకు చెందిన ప్రజలు గాంధారి, బాన్సువాడ మండల కేంద్రాలకు బైక్లపై రాక పోకలు సాగిస్తుంటారు.
గాంధారి మండలంలోని సీతాయిపల్లి, చెన్నా పూర్ గ్రామస్తులు వివిధ పనుల నిమిత్తం ఎల్లారెడ్డి, లింగంపేట మండల కేంద్రానికి వెళ్లివస్తుంటారు. ఈ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. కంచ్మల్ శివారులో 3 నెలల కింద చిరుత సంచరించగా మళ్లీ అదే ప్రాంతంలో చిరుత కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకుని జూపార్కునకు తరలించాలని చుట్టుపక్క గ్రామాల ప్రజలు కోరుతున్నారు.