
- వెల్లడించిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ, ఎన్పీఎస్ సంస్థల్లో గత నాలుగు సంవత్సరాలలో పేరోల్లు/ఉద్యోగాల సంఖ్య 5.2 కోట్ల వరకు ఉంది. వీరిలో 47శాతం మంది మొదటిసారిగా ఉద్యోగాల్లో చేరిన వాళ్లని ఎస్బీఐ తాజా రిపోర్ట్లో వెల్లడించింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) సంస్థలు నెలవారీగా పేరోల్ డేటాను విడుదల చేస్తాయి. 2018 ఏప్రిల్ నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఉన్న డేటాను ఉపయోగించి 'టూవర్డ్స్ ఎ పేరోల్ రిపోర్టింగ్ ఇన్ ఇండియా' పేరుతో ఎస్బీఐ తయారు చేసిన రిపోర్ట్ ఈ వియాన్ని వెల్లడించింది. ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా ట్రెండ్లను బట్టి చూస్తే, 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 ఆర్థిక సంవత్సరం వరకు కొత్త ఈపీఎఫ్ చందాదారుల సంఖ్య 4.86 కోట్లుగా ఉందని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్యకాంతి ఘోష్ చెప్పారు. వీటిలో కొత్త ఉద్యోగాలు (మొదటి పేరోల్), రెండవ పేరోల్ (మళ్లీ చేరిన లేదా తిరిగి సభ్యత్వం పొందిన వాళ్లు), ఫార్మలైజ్డ్ పేరోల్లు ఉన్నాయని చెప్పారు.
2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 ఆర్థిక సంవత్సరం వరకు 2.27 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. అంటే మొత్తం జాబ్స్లో వీరి సంఖ్య 47శాతం వరకు ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంతో ముగిసిన నాలుగు సంవత్సరాల్లో తిరిగి చేరిన వారి సంఖ్య 2.17 కోట్లకు పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 44 లక్షల మంది కొత్తగా ఈపీఎఫ్లో చేరారు. వీరిలో కొత్త వారి సంఖ్య 19.2 లక్షలు ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఇదే ధోరణి కొనసాగితే, 2024 ఆర్థిక సంవత్సరంలో నికర కొత్త పేరోల్స్ 1.60 కోట్ల వరకు ఉండొచ్చని రిపోర్టు పేర్కొంది. ఎన్పీఎస్లో 2023 ఆర్థిక సంవత్సరంలో 8.24 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లు చేరారు. గత 4 సంవత్సరాలలో, దాదాపు 31 లక్షల మంది కొత్తగా చేరారు.