-
ఇన్ఫ్రా, ఎనర్జీ ప్రాజెక్టులకు అప్పులు ఇస్తామంటున్న సీఈఓ
ముంబై: ఇండియా మార్కెట్లో అడుగు పెట్టడానికి అమెరికా కంపెనీ ఎథోస్ ఎసెట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ రెడీ చేసుకుంది. ప్రాజెక్టులకు ఈ కంపెనీ అప్పులిస్తుంది. ఇండియాలో రాబోయే అయిదేళ్లలో బిలియన్ డాలర్ల మేర ప్రాజెక్టులకు అప్పులు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కంపెనీ ఇచ్చే అప్పులను తీసుకున్న వారు 12 ఏళ్ల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా, యూరప్, సౌత్ అమెరికా దేశాలలో ఎథోస్ ఇప్పటికే 9 బిలియన్ డాలర్లను అప్పులుగా ఇచ్చింది. 2012 లో ఎథోస్ కార్యకలాపాలు మొదలెట్టింది. ఇండియా ఎకనమిక్ గ్రోత్తోపాటు, యువత ఎక్కువగా ఉండటం తమను ఆకట్టుకుందని ఎథోస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫౌండర్ కార్లోస్ శాంటోస్ వెల్లడించారు.
ఇండియాలో 10 సెక్టార్లు దూసుకెళ్తున్నాయని చెబుతూ, ఇందులో ఆరు సెక్టార్లు.... ఇన్ఫ్రా, ఎనర్జీ, అగ్రి బిజినెస్, మాన్యుఫాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తనకి ఇష్టమైనవని స్పష్టం చేశారు. 2023 సెకండ్ హాఫ్లో 100 మిలియన్ డాలర్లను వెచ్చిస్తామని, 2024 లో 200 మిలియన్ డాలర్లు వెచ్చిస్తామని ఆయన చెప్పారు. అయిదేళ్లలో ఈ పెట్టుబడులను బిలియన్ డాలర్లకు చేరుస్తామని అన్నారు. క్లయింట్లు జరిపే రీపేమెంట్ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేస్తామని వివరించారు. తాము ఇండియాలో ఇచ్చే అప్పులు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కిందకే వస్తాయని చెప్పారు. ఈ బిజినెస్కు రెగ్యులేటరీ ఇబ్బందులేవీ ఉండకపోవచ్చని అన్నారు. అప్పుగా ఇచ్చే మొత్తంలో అయిదో వంతుకు సెక్యూరిటీ కోరతామని, ఈ సెక్యూరిటీని విదేశాలలో తమకు తనఖా పెట్టాల్సి ఉంటుందని కార్లోస్ శాంటోస్ వివరించారు. ఇప్పుడున్న వడ్డీ రేట్ల ప్రకారం చూస్తే, క్లయింట్లకు తాము ఇచ్చే అప్పులు 5 శాతానికి (ఏడాదికి) దొరుకుతాయని చెప్పారు.