హైదరాబాద్, వెలుగు: పర్యావరణ అనుకూల ఇంధనాలను ఎంకరేజ్ చేయడంలో భాగంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్, బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభించింది. ఈవీ చార్జింగ్ స్టేషన్ మెయిన్ కార్ పార్క్లో ఉండగా, బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రజా రవాణా కేంద్రం (పీటీసీ) వద్ద ఉంది. ఈవీ కస్టమర్లందరికీ ఈ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది.
దీని కెపాసిటీ 30 కిలోవాట్లు. ఒక ఫోర్ వీలర్ను గంటలో పూర్తిగా చార్జ్ చేస్తుంది. ఈ చార్జింగ్ స్టేషన్ యాప్ ద్వారా పని చేస్తుంది. అండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా వాడుకోవచ్చు. ఈవీ స్టేషన్లను నెలకొల్పడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుందని జీహెచ్ఐఏఎల్ పేర్కొంది. వీటితో కాలుష్యం సమస్య ఉండదని, విమానాశ్రయ చుట్టూ పరిసరాల్లో సౌండ్ పొల్యూషన్ తగ్గుతుందని పేర్కొంది. అంతేగాక విమానాశ్రయ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరింత మెరుగవుతుంది. భారతీయ విమానాశ్రయాలలో మొట్టమొదటిసారిగా జీహెచ్ఐఏఎల్ విమానాశ్రయంలో బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ మొదలయింది.
సాధారణ డీజిల్ ఇంజన్లకు కూడా బయోడీజిల్ను వాడొచ్చు. దీని వాడకం డీజిల్ ఇంజన్ల జీవితాన్ని పెంచుతుంది. బయోడీజిల్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ను తగ్గిస్తుందని సంస్థ సీఈఓ ప్రదీప్ పణికర్ అన్నారు. జీహెచ్ఐఏఎల్ మొత్తం సోలార్ పవర్ సామర్థ్యం ఇప్పుడు 10 మెగావాట్లకు పెరిగిందని అన్నారు. దీంతో జీహెచ్ఐఏఎల్కు అవసరమైన సగం కరెంటు అందుతోందని ఆయన వివరించారు.