- అయినా మల్లన్నసాగర్కు లిఫ్ట్ చేస్తలే
- ఇంకో 10 టీఎంసీలు నింపుతామని ప్రకటన
- ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయని సర్కార్
- 50 టీఎంసీల కెపాసిటీకి 11 టీఎంసీలే నిల్వ
హైదరాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి లక్షలాది క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. ఇంతటి వరద వస్తున్నా ఆ నీటిని ఒడిసిపట్టి మల్లన్నసాగర్కు ఎత్తిపోసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. 50 టీఎంసీల కెపాసిటీ ఉన్న మల్లన్నసాగర్లో 11 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది ఇంకో పది టీఎంసీలు జలాశయానికి ఎత్తిపోయాలని జూన్19న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన హైలెవల్ మీటింగ్లో నిర్ణయించారు.
ఒకవేళ సమయానికి వర్షాలు కురవకుంటే కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు ఐదు టీఎంసీలు తరలించాలని కేసీఆర్ఆదేశించారు. ఈ లెక్కన మల్లన్నసాగర్లోకి కనీసం 15 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఎత్తిపోతలతో అవసరం లేకుండానే నిజాంసాగర్ నిండింది.. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆఫ్లైన్ రిజర్వాయర్లుగా ఉన్న రంగనాయక సాగర్లో 3 టీఎంసీలకు గాను 2.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇందులో 2 టీఎంసీలకు పైగా జూన్లో ఎత్తిపోశారు. మల్లన్నసాగర్లో 50 టీఎంసీలకు 11.03 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలకు 8.96 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
వరద వస్తున్నా ఎత్తిపోస్తలే!
డ్యామ్ ప్రొటోకాల్ ప్రకారం ఒక్కసారే రిజర్వాయర్లను పూర్తిగా నింపొద్దని, అందుకే ఈ ఏడాది మల్లన్నసాగర్లో ఇంకో పది టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించామని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. కొండపోచమ్మ సాగర్లో ఇంకో మూడు టీఎంసీల వరకు నింపే అవకాశముంది.
కరెంటు బిల్లులు 60 శాతం తగ్గుతయ్
మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్కు నీళ్లు తరలించా లంటే ఎనిమిది స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయాల్సి ఉం టుంది. అదే మిడ్మానేరుకు వచ్చే వరదను 3స్టేజీల్లో ఎత్తిపోస్తే సరిపోతుంది. కరెంట్ బిల్లుల భారం 60 శాతం తగ్గుతుంది. వరదను మళ్లించుకుంటే మిడ్మానేరులో నిల్వపైనా పెద్దగా ప్రభావం ఉండదు. దీంతో మిడ్మానేరు దిగువన ఉన్న ఎస్సా రెస్పీ ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మిడ్మానేరుకు వరద రాకున్నా ఎస్సారెస్పీ వరద కాలువ నుంచి రోజుకు 2 టీఎంసీలను గ్రావిటీ మిడ్మానేరుకు తరలించి ఆ నీటిని లిఫ్ట్ చేయొచ్చు.
పది రోజులు పంపులు రన్ చేస్తే ఈ టార్గెట్ను రీచ్కావొచ్చు.. ఎస్సారెస్పీ నుంచి ఐదు రోజుల్లోనే మిడ్మానేరుకు పది టీఎంసీలు తరలించే చాన్స్ ఉంది. ఎస్సారెస్పీ గేట్లు గురువారం ఓపెన్చేశారు. అంతకుముందు నుంచే ఆ ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. మరికొన్ని రోజులు వరద వచ్చే చాన్స్ ఉంది. ఇప్పుడు మిడ్మానేరులో 19 టీఎంసీలు నిల్వ ఉండగా, 30 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. గురువారం మిడ్మానేరు గేట్లు ఎత్తిన ఇంజనీర్లు శుక్రవారం మూసేశారు. ఎగువ నుంచి వచ్చే వరదను గేట్ల నుంచి నదిలోకి వదిలేయకుండా అనంతగిరి, రంగనాయకసాగర్మీదుగా మల్లన్నసాగర్కు లిఫ్ట్చేసే అవకాశమున్నా ఆ దిశగా కనీసం ప్రయత్నించడం లేదు.
ఆ హెచ్చరికే కారణమా?
మల్లన్నసాగర్ నిర్మించిన ప్రాంతంలోని భూ అంతర్భాగంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద లీనమెంట్ఉందని, ఇక్కడ రిజర్వాయర్ నిర్మించే అంశాన్ని మరోసారి పరిశీలించాలని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) తన రిపోర్టులో పేర్కొన్నది. ఈ రిపోర్టును ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ఇటీవల కాగ్ తన ప్రాథమిక నివేదికలోనూ పేర్కొంది.
మల్లన్నసాగర్ నిర్మించిన తర్వాత దాని రక్షణ చర్యలపై మరో రెండు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఏ రిపోర్టు ఇచ్చాయనే అంశాన్ని బయటపెట్టడం లేదు. భూకంప ప్రభావ ప్రాంతంలో మల్లన్నసాగర్ను నిర్మించడంతో నీటిని నింపడం ద్వారా దాని కట్టపై పడే ప్రభావంతో పాటు భూ అంతర్భాగంలో తలెత్తే పరిణామాలను గుర్తించడానికి కట్టలోపల ప్రెజో మీటర్లు (నీటి నిల్వను తెలియజేస్తాయి), ఎర్త్ప్రెషర్ సెల్స్ (ఫౌండేషన్పై ఎంత ఒత్తిడి పడుతుందో గుర్తిస్తాయి), కట్ట కింద భాగంలో సెటిల్మెంట్ ఫైండ్స్ (కట్టపై పడే ప్రభావాన్ని నిర్దారిస్తాయి) ఏర్పాటు చేశారు.
ఈ మూడు పరికరాలు కలిపి మొత్తం 125 ఏర్పాటు చేయగా అందులో 80 శాతం పరికరాలు పనిచేయడం లేదు. ఈ మూడు ఎక్విప్మెంట్లు ప్రతి అర గంటకోసారి తన ఫైండింగ్స్ను కంట్రోల్రూమ్కు నివేదిస్తాయి. వాటి రిపోర్టుల ఆధారంగానే కట్ట, రిజర్వాయర్ భద్రతను బేరీజు వేసుకుంటూ నీటిని నిల్వ చేస్తారు. ఎన్జీఆర్ఐ హెచ్చరికలతో పాటు, రిజర్వాయర్ భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎక్విప్మెంట్స్కూడా పనిచేయకపోవడంతోనే మల్లన్నసాగర్లో నీటి నిల్వకు వెనుకాడుతున్నట్టు తెలుస్తున్నది. అందుకే వరద వస్తున్నా ఆ నీటిని ఎత్తిపోయడం లేదని సమాచారం.