20 మంది సైంటిస్టులతో
జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్
జెనెటికల్ డిజార్డర్స్ను ముందే గుర్తించేందుకు ఉపయోగం
నష్టాలూ ఉంటాయంటున్న నిపుణులు
ఒక మనిషి తీరుతెన్నులను చెప్పేది జీన్స్. ఆ మనిషి ఆరోగ్యం, జబ్బులు, శరీరతత్వం వంటి గుట్టులను దాచుకునే బ్రహ్మ పదార్థం. అలాంటి జీన్స్ను ఒక్కచోట చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ను చేపట్టబోతోంది. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ (జీఐపీ) పేరిట రూ.238 కోట్ల ఖర్చుతో జీన్ మ్యాపింగ్ను చేయించబోతోంది. దేశంలోని జీన్స్ వైవిధ్యాన్ని ఒక చోటుకు చేర్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్కు గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఓకే కూడా చెప్పింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), కొన్ని ఐఐటీలకు చెందిన 20 మందికిపైగా సైంటిస్టులు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు.
అతిపెద్ద ప్రాజెక్ట్ హెచ్జీపీ
నిజానికి జీనోమ్ మ్యాపింగ్ అనేది 1990లోనే మొదలైంది. తొలిసారిగా అమెరికా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ (హెచ్జీపీ) ను ప్రారంభించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జీనోమ్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ అదే. అది 2003లో పూర్తయింది. హెచ్జీపీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన సైంటిస్టులు పాల్గొన్నారు. జీనోమ్లను సీక్వెన్స్ చేసి, అందులోని జీన్స్ను గుర్తించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. దీంట్లో చాలా వరకు సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. జీన్స్ లొకేషన్ను గుర్తించి, వాటి నిర్మాణం, పనితీరును తెలుసుకోగలిగారు.
లాభమేంటి?
జీనోమ్ మ్యాపింగ్లో భాగంగా క్రోమోజోముపై ఒక జీన్ ఉండే కచ్చితమైన ప్రాంతాన్ని తెలసుకుంటారు. ఆ క్రోమోజోముపై జీన్స్ మధ్య దూరాన్ని లెక్కగడతారు. వాటితో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే జబ్బులను సైంటిస్టులు తేలికగా గుర్తించగలుగుతారు. ఒక జీన్ వల్లే ఆ జబ్బు వస్తుందా.. లేదా కొన్ని జీన్స్ వల్ల వస్తుందా అన్నది తేలుస్తారు. జీనోమ్ మ్యాపింగ్ ద్వారా జబ్బు కారణమయ్యే ఆ జీన్ ఉన్న క్రోమోజోమ్ ఏదో కూడా కచ్చితంగా గుర్తించగలుగుతారు. ఉదాహరణకు అదరుదైన సింగిల్ జీన్ డిజార్డర్స్ సిస్టిక్ ఫైబ్రోసిస్ (ఊపిరితిత్తులు, పాంక్రియాస్లో అడ్డుపడే మ్యూకస్), డుషినీ మస్క్యులర్ డిస్ట్రొఫీ (కండరాల బలహీనత) వంటి వాటికి కారణమయ్యే ప్రత్యేకమైన జీన్స్ను జీనోమ్ మ్యాపింగ్ ద్వారా గుర్తించొచ్చని నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్హెచ్జీఆర్ఐ) సైంటిస్టులు చెబుతున్నారు. అంతేగాకుండా కామన్గా వచ్చే ఆస్తమా, కేన్సర్, గుండెజబ్బులకు కారణమయ్యే జీన్స్నూ తెలుసుకునే వీలు కలుగుతుందంటున్నారు.
నష్టాలేంటి?
ఏదైనా రోగమొస్తుందని ముందే తెలిస్తే ఏమవుతుంది? ముందు ఆ మనిషి కుంగిపోతాడు. ఆ జబ్బు రాకముందే, వస్తుందన్న బెంగతోనే ఎక్కువ ఆందోళనకు గురవుతారు. దాని వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని సైంటిస్టుల వాదన. ఇంకొకటి, పిల్లలను కనకపోవడం. అవును, తమ వల్ల పిల్లలకు ఏ జబ్బు రాకూడదనుకునే వాళ్లు, పిల్లలను కనకుండా ఉండిపోతారని అంటున్నారు. ఇంకో ముఖ్యమైనది, ఉద్యోగాల్లో వివక్ష ఎదుర్కవోల్సి వస్తుందట. జబ్బు వచ్చే అవకాశం ఉన్న వ్యక్తికి కంపెనీలు ఉద్యోగం ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించే అవకాశం లేకపోలేదన్నది సైంటిస్టుల వాదన. అంతేగాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలూ ఆ సౌకర్యాన్ని సదరు వ్యక్తికి కల్పించకుండా అడ్డుకునే చాన్స్ ఉంటుందని అంటున్నారు. మొత్తంగా వీటన్నింటి వల్ల మనిషికి ఎదురయ్యేది అతిపెద్ద సమస్య ‘ప్రైవసీ’. ఇవన్నీ కలిసి జీనోమ్ మ్యాపింగ్కు నష్టాలంటున్నారు నిపుణులు.
ఒక్కో కణంలో 20,500 జీన్స్
కణము..కణము కలిస్తే మనిషి. ఒక్కో కణంలో 23 జతల క్రోమోజోములుంటాయి. అంటే మొత్తం ఒక్క కణంలో 46 క్రోమోజో ములుంటాయి. వాటిలో దాదాపు 20,500 జీన్స్ ఉంటాయని హెచ్జీపీలో గుర్తించారు. ఆ జీన్స్ అన్ని కలిసికట్టుగా ఉండేదే జీనోమ్. అంటే డీఎన్ఏల సమాహారమన్నమాట. క్రోమోజోముపై ఇవి వరుసగా ఉంటాయి. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ వరుస క్రమమే ఓ మనిషిలో పుట్టుకతో వచ్చే జీన్స్ను ఎఫెక్ట్ చేస్తుందన్నది సైంటిస్టుల వాదన. ఉదాహరణకు జీన్స్ ఆనుకుని ఉంటే, ఆ జీన్స్ మరో వ్యక్తిలో జంటగా ఉండే అవకాశం ఉంటుందట. అందుకే వాటి గుట్టును విప్పేందుకే ఈ జీనోమ్ మ్యాపింగ్ను చేస్తున్నారు. ఇప్పుడు మన దేశమూ
ఆ ప్రాజెక్ట్ను చేస్తోంది.