పోలింగ్​కు అంతా రెడీ

పోలింగ్​కు అంతా రెడీ

ఎన్నికల సామగ్రితో సెంటర్లకు చేరిన సిబ్బంది

  • మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,367
  • సమస్యాత్మక​ కేంద్రాలపై స్పెషల్​ ఫోకస్​
  • ప్రతి గంటకూ ఓటింగ్ శాతం నమోదు

నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,41,367 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,501 మంది పురుషులు,  1,19,859 మంది మహిళలు, ఇతరులు ఏడుగురు ఉన్నారు. మొత్తం ఏడు మండలాల్లో కలిపి 298 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్బన్​ పరిధిలో 35, రూరల్​ పరిధిలో 263 పోలింగ్​ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్​స్టేషన్​పరిధిలో ఒక ప్రిసైడింగ్​ఆఫీసర్, అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ఆఫీసర్​తో పాటు సహాయ సిబ్బంది ఉంటారు. మొత్తంగా 373 మంది పీఓలు, 373 మంది ఏపీఓలు, 740 జీపీఓలు  విధులు నిర్వహిస్తారు.  ఎన్నికల పరిశీలనకు 199 మంది మైక్రో అబ్జర్వర్లు, 50 ఫ్లయింగ్​స్క్వాడ్స్​, 16 మంది నోడల్ అధికారులను 
నియమించారు.

 ఓటింగ్​ శాతం నమోదుకు స్పెషల్​ యాప్​..

1,492 మంది పోలింగ్​ సిబ్బంది బుధవారం రాత్రే వారికి కేటాయించిన పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నారు.  చండూర్​లోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. రూట్ల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్​లు,  స్టాట్యుటరీ, నా న్ స్టాట్యూటరీ మెటీరియల్​తో పోలింగ్ సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో  తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉప ఎన్ని క సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్ రావు, రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ మెటీరియల్ పంపిణీని పర్యవేక్షించారు.  కాగా, ప్రత్యేకంగా రూపొందించిన యాప్​ ద్వారా గంటగంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదు చేయనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

మొదటిసారి ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులు

తొలిసారి ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తుండగా.. ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తి చేశారు. ఆన్​లైన్​లోనూ ఈ స్లిప్​లను అందుబాటులో ఉంచారు. అన్ని పోలింగ్​ కేంద్రాల్లో షామియానాలతో పాటు వృద్ధులకు వీల్​చైర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారు.

ఒక్కో స్టేషన్​లో మూడు బ్యాలెట్​ యూనిట్లు

 ఉప ఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు.  ఒక్కో బ్యాలెట్​లో 16 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో ఒక్కో  పోలింగ్​స్టేషన్​లో మూడు బ్యాలెట్​యూనిట్లను వినియోగిస్తున్నారు.  ఒక కంట్రోల్​యూనిట్​, మూడు బ్యాలెట్​యూనిట్లు, ఒక వీవీప్యాట్​చొప్పున మొత్తం 1207 బ్యాలెట్ యూనిట్స్, 403 కంట్రోల్ యూనిట్లు, 403 వీవీ ప్యాట్లను పోలింగ్​స్టేషన్లకు చేర్చారు. ఎక్కడైనా సాంకేతి సమస్య వస్తే ఈవీఎంలను రిపేర్​ చేసేందుకు బెల్​కంపెనీ ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. 


 రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ ​జరిగే అవకాశం..


ప్రతి పోలింగ్​ కేంద్రం పరిధిలో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండడం, నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలే 105 దాకా ఉండడంతో పోలింగ్​ఆలస్యమయ్యే చాన్స్​ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నారాయణ్​పూర్​, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని పలు గ్రామాలు, తండాల్లో పోలింగ్​ రాత్రి పొద్దు పోయే వరకు జరగొచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఎంత రాత్రయినా ఓటువేసే అవకాశం కల్పిస్తారు. 6 గంటలకు క్యూలో చివర ఉన్న వ్యక్తికి ఫస్ట్​ నంబర్​ కేటాయించి, పోలింగ్​కంప్లీట్​ చేస్తామని ఆఫీసర్లు తెలిపారు. కాగా, చౌటుప్పుల్ పోలింగ్​స్టేషన్​నంబర్​93 పోలింగ్​స్టేషన్​లో అత్యధికంగా 1462 ఓటర్లు ఉండగా, అతి తక్కువగా నారాయణ్ పూర్ మండలం ఐద్దోనుల తండా పోలింగ్​స్టేషన్​పరిధిలో 108 మంది ఓటర్లు ఉండడం గమనార్హం.

బందోబస్తు డ్యూటీలో 5 వేల మంది పోలీసులు.. 

నియోజకవర్గంలో 105 సమస్యాత్మకంగా కేంద్రాల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.  దాదాపు 5వేల మంది పోలీస్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.  ప్రతి పోలింగ్​సెంటర్​లో వైఫై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీస్​ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడెంచల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. పోలింగ్ ​ముగిశాక ఈవీఎంలను నల్గొండలోని ఆర్జాలబావి ప్రాంతంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్​రూమ్​కు తరలించి భద్రపరుస్తారు. అన్ని సెంటర్ల నుంచి ఈవీఎంలు చేరుకున్నాక అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్​రూమ్​సీజ్​ చేస్తారు. ఇక్క డ ఐదెంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ తెలిపారు. 

పోస్టల్​ ఓట్లు 686 

మునుగోడు నియోజకవర్గంలో పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు ఎన్ని వచ్చాయో తేలిపోయింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్​ ఓట్లు 739 ఉండగా ఇందులో 686 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.