బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ నితీశ్కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెపుతున్నాయి. అవి ఏమేరకు నిజం కాబోతున్నాయో రేపు (14వ తేదీ) తెలిసిపోనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నితీశ్కుమార్ బిహార్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా (మధ్యలో తానే నియమించిన జీతన్ రామ్ మాంజీ కొద్ది నెలల పాటు సీఎంగా ఉండడం తప్ప) పాలిస్తూ 20 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి జాబితాలోకి ఇపుడు నితీశ్కుమార్ కూడా చేరిపోయారు.
ఒకప్పుడు లాలూ, నితీశ్ రాజకీయాల్లో మంచి మిత్రులు. 1990 నుంచి 95 వరకూ
వీళ్లిద్దరి కాంబినేషన్కు బిహార్లో తిరుగులేదు. 15 ఏండ్ల లాలూ యాదవ్ పాలన తీరువల్ల .. బిహార్లో ప్రత్యామ్నాయ నాయకుడిగా నితీశ్కుమార్కు కలిసొచ్చింది. నితీశ్ ఈ స్థాయికి ఎదిగిరావడంలో ఆయన రాజకీయ గురువుగా జార్జ్ ఫెర్నాండెజ్ పాత్ర కాదనలేనిది. నిజానికి గత 35 ఏండ్లుగా లాలూ వర్సెస్ బీజేపీలే ప్రధాన ప్రత్యర్దులుగా నడుస్తూ వస్తున్నాయి. అందులో ఎవరు అధికారం చేపట్టాలన్నా నితీశ్కుమార్ సహకారం అనివార్యమవుతోంది. నితీశ్కుమార్ పొలిటికల్ క్యారెక్టర్ అందరికీ ఆమోద యోగ్యమే అని గడిచిన 40 ఏండ్ల బిహార్ రాజకీయ చరిత్ర చెపుతోంది.
పల్టూరామ్!
నితీశ్కుమార్ 20 ఏండ్లలో 4సార్లు కూటములు మార్చాడు. ఏ కూటమిలో చేరినా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. అదే నితీశ్ పొలిటికల్ సక్సెస్ అనొచ్చు. అదే సమయంలో చాలామంది ఆయనకో ‘నిక్ నేమ్’ కూడా ఇచ్చారు ‘పల్టూరామ్’ అని! బిహార్లో అనేక సార్లు కూటమి మార్చిన నితీశ్కుమార్ను ప్రజలు పెద్దగా తప్పు పట్టలేదనే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు.
నితీశ్ పొలిటికల్ కెరీర్లో పెద్దగా మరకలు లేవు. కుటుంబాన్ని రాజకీయాల్లోకి తేలేదు. మిగతా నాయకుల కంటే ఆయనలో కాస్త నిజాయితీ ఎక్కవ అనే అక్కడి ప్రజల నమ్మకమే ఆయన్ను సుదీర్ఘ కాలం బిహార్కు ముఖ్యమంత్రిగా కొనసాగించిందని చెప్పాలి. సోషల్ ఈక్వేషన్ వల్ల బీజేపీ కూడా ఆయన్ను ముఖ్యమంత్రిగా కొనసాగించిదనే చెప్పొచ్చు.
యాదవేతర ఓబీసీలను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీకి నితీశ్ కుమార్ నాయకత్వం బాగా తోడ్పడింది కూడా! అలాగే, మహా దళిత్లు, ఈబీసీలు కూడా బీజేపీకి చేరువ కావడానికి నితీశ్ కుమార్ నాయకత్వం తోడ్పడింది. బిహార్లో ఎంతగా కుల రాజకీయాలు ఉన్నా.. ముఖ్యమంత్రి క్యారెక్టర్ కు కూడా అక్కడి ప్రజలు ప్రాధాన్యత ఇస్తారనడానికి నితీశ్ పొలిటికల్ కెరీరే అందుకు సాక్ష్యం!
అందరి ఆమోదనీయతే నితీశ్ సక్సెస్!
పల్టూరామ్గా ఆయనను ప్రతిపక్షాలు ఎంతగా నిందించినా..బిహార్ రాజకీయ సమీకరణలు ఆయనకు అన్ని పార్టీలలో ఆమోదనీయతను తెచ్చిపెట్టింది. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, బీజేపీలలో ఎవరు అధికారంలోకి రావాలన్నా మూడోపార్టీగా జనతాదళ్ (యూ) చీఫ్ నితీశ్ కుమార్ ఒక అనివార్య నేతగా మారాడు. ఈ ప్రబల కారణం వల్లనే ఆయన ఎన్నిసార్లు కూటములు మారినా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రజల్లో ఆయన నాయకత్వానికి ఆమోదనీయతే లేకపోతే, కూటములు మార్చినా కూడా 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేవాడు కాదనే చెప్పాలి.
లాలూది జంగల్ రాజ్ అన్నా.. తేజస్వీని అలాగే చూడడం లేదు!
లాలూ పరిపాలనా కాలం ‘జంగల్ రాజ్’గా అపవాదుకు గురైన మాట నిజమే. కానీ బీజేపీ నిన్నటి ఎన్నికల్లో కూడా ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ జంగల్ రాజ్ వస్తుందని ప్రచారం చేసింది. నిజానికి లాలూ శకం ముగిసి 20 ఏండ్లు దాటింది. ఇపుడు ఆర్జేడీ లాలూ నేతృత్వంలో లేదు. ఆయన కొడుకు తేజస్వీ యాదవ్ నాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ‘జంగల్ రాజ్’ అనే పదం బహుశా తేజస్వీకి ఆపాదించినా అది వర్కౌట్ కాదేమో! లాలూ వేరు, తేజస్వీ వేరు అనే విషయం బిహారీ ప్రజలకు తెలుసు.
సీఎంగా తేజస్వీకే మొగ్గు?
గతంలో తేజస్వీ రెండుసార్లు నితీశ్కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు తండ్రికన్నా కొంత భిన్నమైందనే పేరుంది. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్లోనూ ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారనంటే.. తేజస్వీనే ఎక్కువమంది కోరుకుంటున్నట్లు తేలింది కూడా. అంటే ఎన్డీఏ నేతలైన నితీశ్, చిరాగ్, సమ్రాట్ చౌదరిని కోరుకున్నవారిని కలిపి చూస్తే.. తేజస్వీకన్నా ఎన్డీఏ నేతలను కోరుకున్నవారి సంఖ్య ఎక్కువే అయినా.. వ్యక్తిగతంగా చూస్తే తేజస్వీని కోరుకున్నవారే ఎక్కువ.
నితీశ్పట్ల పాజిటివ్ అంశాలు
బిహార్ ఎన్నికల్లో నితీశ్కుమార్కు ఉన్న పాజిటివ్ అంశాలు ఏమిటంటే.. గ్రామీణ స్థాయికి రోడ్ కనెక్టెవిటీ పెరిగింది. ఇంటింటికి తాగునీరు, కోతలు లేని విద్యుత్ అందించడం వంటివి నితీశ్ కుమార్ ప్రజల కనీస అవసరాలు తీర్చాడనే చెప్పాలి. సంక్షేమ పథకాల విషయంలో బిహార్ మహిళలకు అనేక పథకాలు అందించిన పేరుంది. ఎన్నికల ముందు పేద మహిళలకు ‘జీవికా దీదీ’ ఉపాధి కోసం రూ.10 వేలు నగదు పంపకం ఎన్నికల్లో ఎన్డీఏకు కలిసొచ్చే అంశంగా చెపుతున్నారు. ఘర్, పానీ, బిజిలీ వంటి కేంద్ర పథకాల వల్ల ప్రధాని మోదీ పట్ల కూడా ప్రజల్లో సానుకూలత ఉండడం నితీశ్కు కలిసొచ్చే అంశం.
నెగెటివ్ అంశాలు
నితీశ్కుమార్ పాలన పట్ల ప్రజల్లో నెగెటివ్ అంశాలు ఉన్నా అవి అంత బలమైనవి కాకపోయినా.. సుదీర్ఘ కాలంగా (20 ఏండ్లు) ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడం వల్ల ఒకసారి మార్పు కోరితే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రజల్లో కొంతమేరకు ఉంది. నితీశ్ ప్రభుత్వ హయాంలో అన్నీ బాగానే జరిగాయి కానీ, బిహార్కు పరిశ్రమలు రాలేదు. ఉపాధి, ఉద్యోగాలు రాలేదనే అభిప్రాయం యువతలో బలంగా కనిపిస్తోంది. ఈ యువతపైనే ఆర్జేడీ చాలా ఆశలు పెట్టుకుంది కూడా. అందుకే తేజస్వీ అసాధ్యమని తెలిసినా.. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ప్రకటించాడు. సాధ్యాసాధ్యాల సంగతి పక్కన పెట్టి. యువతలో అసహనాన్ని తేజస్వీ సొంతం చేసుకునే ప్రయత్నం చేశాడు.
మెజారిటీ సాధించపోతే నితీశ్కు ఇవే చివరి ఎన్నికలేమో!
కేంద్రంలో మోదీ ప్రభుత్వం నితీశ్ మద్దతుపై ఆధార పడి ఉంది. కాబట్టి ఒకవేళ ఎన్డీఏ మెజారిటీ సాధిస్తే నితీశ్కుమారే ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ నితీశ్కుమార్ ఈ సారి మెజారిటీ సాధించలేకపోతే ఆయన రాజకీయ చరిత్రకు ఫుల్స్టాప్ పడే అవకాశాలే ఎక్కువ! ఒకవేళ తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం, ఎన్నికల్లో మహాఘట్బంధన్ యాదవేతర ఓబీసీల మద్దతు ఏమేరకు సాధించగలిగిందనే దానిపైనే అధారపడిఉంటుంది! తేజస్వీ మెజారిటీ
సాధించలేకపోయినా, ఆయన రాజకీయ జీవితం ఆగేది మాత్రం కాదు. బిహార్ ఫలితాలు దేశ రాజ కీయాలను ఎంతోకొంత ప్రభావితం చేస్తాయనే చెప్పాలి.
యాదవేతర ఓబీసీల మద్దతు ఎటు వైపు?
జేడీయూ, బీజేపీ కూటమి వైపు యాదవేతర ఓబీసీ, ఈబీసీ, మహాదళిత్, అగ్రవర్ణాల సంప్రదాయక మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆర్జేడీ పక్షాన ఎప్పటిలాగే ‘ఎమ్వై’ ఫ్యాక్టర్ (ముస్లిం, యాదవ్) మొగ్గు అలాగే కొనసాగుతోంది. అయితే యాదవేతర బీసీలను ఆకట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేమని తేజస్వీకి తెలుసు. ఈ సారి టికెట్ల పంపకంలో యాదవేతర బీసీ అభ్యర్థులకు బాగానే ప్రాధాన్యమిచ్చాడు.
కానీ అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చెప్పడం కష్టమే. ఎంవై ఫ్యాక్టర్ దాటి ఇతరుల ఓట్లు సాధిస్తే తప్ప, తేజస్వీ మెజారిటీ సాధించడమనేది కష్టమే! ఒకవేళ యాదవేతర బీసీల ఓట్లను కూడా రాబట్టుకుంటే తప్ప తేజస్వీ మెజారిటీ సాధించడం కష్టమే! బిహార్లో నితీశ్ – ఎన్డీఏ కూటమిని గెలిపిస్తు వస్తున్నది యాదవేతర ఓబీసీ, ఈబీసీలే కావడం గమనార్హం.
- కల్లూరి శ్రీనివాస్రెడ్డి,సీనియర్ జర్నలిస్ట్
