పరారీలో దొంగ నోట్ల ప్రధాన సూత్రధారి..ఏడుగురు నిందితుల అరెస్ట్..రూ.9.86 లక్షల విలువైన నోట్లు స్వాధీనం

పరారీలో దొంగ నోట్ల ప్రధాన సూత్రధారి..ఏడుగురు నిందితుల అరెస్ట్..రూ.9.86 లక్షల విలువైన నోట్లు స్వాధీనం

వర్ని, వెలుగు: దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్​ చేయగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. ఈ నెల 18న ఓ రైతు నిజామాబాద్​ జిల్లా వర్ని కెనరా బ్యాంక్​లో క్రాప్​ లోన్​ చెల్లించేందుకు వెళ్లగా దొంగనోట్ల వ్యవహారం బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఈ వ్యవహారంలో 8 మంది ఉన్నారని, మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లకు చెందిన రవికుమార్​రెడ్డి ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు.

 ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మిగిలిని ఏడుగురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్లు బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ తెలిపారు. వర్ని మండలం జలాల్​పూర్​ గ్రామానికి చెందిన నరెడ్ల చిన్న సాయిలు ఈ నెల 18న కెనరా బ్యాంక్​లో క్రాప్​ లోన్​ చెల్లించేందుకు రూ.2,08,500 తీసుకొని బ్యాంకుకు వచ్చాడు. ఆ నోట్లను పరిశీలించిన బ్యాంక్​ అధికారులు దొంగనోట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాయిలును అదుపులోకి తీసుకొని విచారించారు. 

జలాల్​పూర్​ సర్పంచ్​ భర్త నరెడ్ల బాలు, అతని తమ్ముడు బీజేపీ నేత నరెడ్ల శంకర్, చందూరు మండలానికి చెందిన సటోజి గోపాల్, వర్ని మండలం అఫంది ఫారమ్​కు చెందిన పాల్య కల్యాణ్, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఆకాశ్, రమేశ్, మహదేవ్​ను నిందితులుగా గుర్తించారు. ప్రధాన సూత్రధారి ఆకాశ్,​ రమేశ్​తో కలిసి కొద్ది రోజుల కింద రూ.4 లక్షల దొంగ నోట్లు ముద్రించి వికారాబాద్ లో వాటిని చలామణి చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద రూ.9.86 లక్షల దొంగ నోట్లు, ల్యాప్​టాప్, రెండు ప్రింటర్లు, కారు, మూడు సెల్​ఫోన్లు, ముద్రణ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.