జీడిమెట్ల, వెలుగు : రైతులను మోసంచేసి నకిలీ పురుగుల మందు విక్రయిస్తున్న ముఠా గుట్టును బాలానగర్ ఎస్ఓటీ, జీడిమెట్ల పోలీసులు రట్టుచేశారు. రూ.20 లక్షల విలువైన 1,160 లీటర్ల పురుగుల మందును స్వాధీనంచేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వివరించారు. హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన బిల్లిపల్లి నరేందర్ రెడ్డి (35) అగారియా క్రాప్స్ సైన్సెస్ పేరుతో బయో పెస్టిసైడ్స్ బిజినెస్ చేస్తున్నాడు.
ఏపీలోని గుంటూరు జిల్లా చెరుకుపల్లి, గూడవెల్లికి చెందిన దాసరి వెంకటేశ్వరావు (52) పురుగుల మందు డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాడు. నరేందర్రెడ్డికి పురుగుల మందులపై మంచి అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన మెనోక్రోటోపాస్, గ్లైపోసేట్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అతను గుర్తించాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి వాటిని విక్రయించాలని ప్లాన్ చేశాడు. అతనికి బయోపెస్టిసైడ్స్ తయారీ అనుమతులు ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా కెమికల్ పెస్టిసైడ్స్ అమ్మాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా నరేందర్ రెడ్డి గుజరాత్ నుంచి నకిలీ పురుగుల మందులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాడు. అనంతరం వాటిని చిన్నగా కంటెయినర్స్లోప్యాక్ చేసి వివిధ రకాల నకిలీ కంపెనీల లేబుల్స్ అతికించి వెంకటేశ్వరావు సహయంతో రైతులకు అమ్మాడు.
కాగా, మంగళవారం సాయంత్రం నరేందర్ రెడ్డి, వెంకటేశ్వరావు మరో వ్యక్తి కురకుల రాజు (26) డ్రైవర్తో కలిసి నకిలీ పురుగుల మందులను ఓ మినీ ట్రక్లో నింపారు. వాటిని అబ్దుల్లాపూర్మెట్ నుంచి నర్సాపూర్ ఏరియాలో రైతులకు అమ్మడానికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ, జీడిమెట్ల పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన నకిలీ పురుగుల మందు బాటిల్స్, వెహికల్, మూడు మెబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. కాగా, ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే డయల్100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.