- టిక్కెట్ల కోసం తండ్లాట
- ఆన్లైన్లో కనిపించక... ఆఫ్లైన్లో లేక ఫ్యాన్స్ తిప్పలు
- పేటీఎంలోనే ఇండియా–ఆసీస్ మొత్తం టిక్కెట్ల అమ్మకం: హెచ్సీఏ
- పాసుల కోసం పోలీసులు, అధికారుల ఒత్తిడి లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇండియా–ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25వ తేదీ ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పలు పడుతున్నారు. దాదాపు మూ డేళ్ల తర్వాత సిటీలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగు తుండటంతో టిక్కెట్ల కోసం సాధారణ ఫ్యాన్స్తో పాటు ప్రముఖులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అఫీషియల్ టికెటింగ్ పార్ట్నర్ ‘పేటీఏం’ యాప్లో ఈ నెల 15వ తేదీన సేల్స్ ప్రారంభించగా.. క్షణాల్లో టిక్కెట్లు మాయం అయ్యాయి. మెజారిటీ ఫ్యాన్స్ పేటీఎంలో ఎంత ప్రయత్నించినా.. తమకు టిక్కెట్లు దొరకలేదని చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39 వేలు కాగా.. తొలి దఫాలో పేటీఎంలో ఎన్ని టిక్కెట్లు అమ్మారు? ఇంకా ఎన్ని మిగిలున్నాయి? అనేదానిపై క్లారిటీ లేదు.
సెకండ్ ఫేజ్ టిక్కెట్లు త్వరలో అందుబాటులో ఉంచుతామని పేటీఎం చెప్పినా.. ఎప్పటి నుంచి సేల్ చేస్తారు? ఏయే కేటగిరీ టిక్కెట్లు ఎన్ని ఉన్నాయి? అనేది కూడా తెలియడం లేదు. మరోవైపు మ్యాచ్కు సంబంధించి అన్ని టిక్కెట్లను ‘పేటీఎం’ ద్వారా సేల్ చేస్తామని హెచ్సీఏ సోమవారం ప్రకటించింది. పాసులు కావాలని పోలీసులు, ప్రభుత్వ అధికారుల నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, అవన్నీ పుకార్లే అని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నివారించడానికి మొత్తం టిక్కెట్లను ‘పేటీఎం’లోనే పారదర్శకంగా అమ్మకానికి ఉంచుతామని స్పష్టం చేసింది. కానీ, దీనిపై క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. ‘పేటీఎం’ యాప్లో ఎంత ప్రయత్నించినా టిక్కెట్లు దొరకడం లేదని.. కనీసం కౌంటర్లలో ఉంచితే నేరుగా వెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు.