
కోదాడ, వెలుగు: తన భూమి కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ ఓ రైతు ఆర్డీవో ఆఫీస్ఎదుట పెట్రోల్పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన రైతు వీర నాగులుకు గ్రామంలో ఎకరం 30 గుంటల భూమి ఉంది. గత సీజన్ వరకు రైతుబంధుతోపాటు అనేక పథకాలు వర్తించాయని, కానీ వారం క్రితం తహసీల్దార్ఆఫీసుకు వెళ్లగా భూమి తన పేరు మీద లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని, తనకు న్యాయం చేయాలంటూ కోదాడ ఆర్డీవో ఆఫీస్ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను మీద పోసుకోగా గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో చెప్పారు.