కెమికల్ ఎరువులు లేని సాగు సాధ్యం కాదనేటోళ్లు ఒకప్పుడు.. కానీ,సేంద్రియ వ్యవసాయాన్ని మించింది మరొకటి లేదని రుజువు చేస్తున్నారు చాలామంది రైతులు. అందులోనూ నేచురల్ ఫార్మింగ్లో అరుదైన పంట లు పండిస్తున్నారు కొందరు. ఆ కోవకే చెందు తాడు మెదక్ జిల్లాకి చెందిన సాయిరెడ్డి. 35 ఎకరాల్లో ఆరేండ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు ఇతను. అరటి, జామతో పాటు డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తున్నాడు. దీనంతటికీ ఇన్స్పిరేషన్ టీవీలో చూసిన సుభాష్ పాలేకర్ స్పీచ్ అని చెప్తున్నాడు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వల్లభాపూర్ సాయిరెడ్డి సొంతూరు. ఇంతకుముందు తనకున్న 35 ఎకరాల్లో చెరుకు పండించేవాడు. కానీ, కొన్నేండ్ల కిందట జిల్లాలోని చక్కెర ఫ్యాక్టరీ మూతపడి, పండించిన చెరుకు అమ్మడం కష్టమైంది. దాంతో చెరుకుకి ప్రత్యామ్నాయ పంటలు వెతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ టైంలోనే టీవీలో సుభాష్ పాలేకర్ స్పీచ్ విన్నాడు. ఆయన ప్రేరణతో నేచురల్ ఫార్మింగ్ గురించి మరింత తెలుసుకున్నాడు. పాలేకర్ పుస్తకాలు చదివాడు. క్లాసులకి వెళ్లాడు. పురుగుమందులు, రసాయనాల జోలికి పోకుండా తన పొలంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆరేండ్ల నుంచి సేంద్రియ బాటలోనే నడుస్తున్నాడు. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్కి ఉన్న డిమాండ్ చూసి, ఎకరం విస్తీర్ణంలో దాన్ని కూడా సాగు చేస్తున్నాడు.
మంచి రేటు పలుకుతున్నయ్
ఇరవై ఎకరాల్లో అరటి, ఐదు ఎకరాల్లో తైవాన్ జామ, ఒక ఎకరం డ్రాగన్ ఫ్రూట్తో పాటు మరికొన్ని పంటలు పండిస్తున్నాడు సాయిరెడ్డి. అరటిలో అంతర పంటగా అల్లం సాగు చేస్తున్నాడు. ఇదివరకు జామ, డ్రాగన్ ఫ్రూట్ తోట మధ్యలో అంతర పంటగా ఐదెకరాల్లో కొలంబో కంది వేశాడు. ఎకరాకు 12 చొప్పున 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అలాగే పొలంగట్ల వెంట 1,500 దేశవాళీ కొబ్బరి చెట్లు, వంద వరకు మామిడి చెట్లు పెంచుతున్నాడు. ఈ పంటలన్నింటికీ పది వేల లీటర్ల జీవామృతాన్ని పొలంలోనే తయారుచేస్తున్నాడు సాయిరెడ్డి. అందుకోసం ఇరవై ఆవులను పెంచుతున్నాడు. పొలంలోనే ఒక పెద్ద సిమెంట్ ట్యాంక్, కొన్ని ప్లాస్టిక్ ట్యాంక్లు ఏర్పాటు చేశాడు. వాటిలో ఆవుపేడ, మూత్రం, బెల్లం, శనగపిండి లాంటివి కలిపి జీవామృతాన్ని తయారుచేసి ఎరువుగా వేస్తున్నాడు. ‘‘సేంద్రియ సేద్యంలో కెమికల్ ఎరువుల ఖర్చు ఉండదు. కానీ కలుపు నివారణ ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది’’అంటున్నాడు సాయిరెడ్డి. పంట దిగుబడి కాస్త అటుఇటుగా ఉన్నా సేంద్రియ పంటలకి మార్కెట్లో మంచి రేటు పలుకుతుందని చెప్తున్నాడు.
డ్రాగన్ సాగుచేస్తున్నా
‘‘డ్రాగన్ ఫ్రూట్లో పోషక విలువలు, ఔషధ గుణాలు ఎక్కువ. అందుకే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది వీటికి. పైగా డ్రాగన్ మొక్క ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడికి పదింతలు ఎక్కువ లాభం వస్తుంది. అందుకే డ్రాగన్ సాగు చేస్తున్నా. అది కూడా సేంద్రియ పద్ధతిలో. నేను పండించిన అరటి, జామ, డ్రాగన్ ఫ్రూట్స్ను మా ఊరికి దగ్గర్లోని 44వ నెంబర్ నేషనల్ హైవే మీదనే అమ్ముతున్నా. వేరే జిల్లాల నుంచి నన్ను కలవడానికి కొందరు రైతులు వస్తుంటారు. సేంద్రియ వ్యవసాయం గురించి అడిగి తెలుసుకుంటారు. అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు నడిస్తే.. దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది’’ అంటున్నాడు సాయిరెడ్డి.