సెంచరీతో చెలరేగిన గిల్‌‌ ..ఫస్ట్ డే స్కోర్ ఎంతంటే.?

సెంచరీతో చెలరేగిన గిల్‌‌ ..ఫస్ట్ డే  స్కోర్ ఎంతంటే.?

బర్మింగ్‌‌హామ్‌‌: ఇంగ్లండ్‌‌తో బుధవారం మొదలైన రెండో టెస్ట్‌‌లో ఇండియాకు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (216 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్‌‌) సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్‌‌ (87) మెరుగ్గా ఆడటంతో.. తొలి ఇన్నింగ్స్‌‌లో ఇండియా 85 ఓవర్లలో 310/5 స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి గిల్‌‌తో పాటు రవీంద్ర జడేజా (41 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. కరుణ్‌‌ నాయర్‌‌ (31) ఫర్వాలేదనిపించాడు. క్రిస్‌‌ వోక్స్‌‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌‌ కోసం ఇండియా తుది జట్టులో మార్పులు చేసింది. బుమ్రా, శార్దూల్‌‌, సాయి సుదర్శన్‌‌ ప్లేస్‌‌లో ఆకాశ్‌‌ దీప్‌‌, సుందర్‌‌, నితీశ్‌‌ రెడ్డి జట్టులోకి రాగా, కుల్దీప్‌‌ యాదవ్‌‌కు చోటు దక్కలేదు. 

జైస్వాల్‌‌ ఒక్కడే..

వాతావరణం మేఘావృతంగా ఉండటంతో ఇంగ్లండ్‌‌ కెప్టెన్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ టాస్‌‌ గెలిచి ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు ఆరంభంలో ఇంగ్లిష్‌‌ పేసర్లు చుక్కలు చూపించారు. తొలి గంటలో బాల్‌‌ ఎక్కువగా స్వింగ్ కాకపోయినా, కార్స్‌‌ (1/49) జైస్వాల్‌‌ పక్కటెముకలను లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లు సంధించాడు. అయినప్పటికీ ధైర్యంగా ఆడిన జైస్వాల్‌‌ అతని బౌలింగ్‌‌లోనే అద్భుతమైన కవర్‌‌ డ్రైవ్స్‌‌తో రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చాడు. తర్వాత స్టోక్స్‌‌ బౌలింగ్‌‌లో బ్యాక్‌‌వర్డ్‌‌ పాయింట్‌‌ మీదుగా పుల్‌‌, స్లాప్‌‌ షాట్స్‌‌ కొట్టాడు. కానీ 9వ ఓవర్‌‌లో క్రిస్‌‌ వోక్స్ వేసిన ఇన్‌‌ స్వింగర్‌‌కు కేఎల్‌‌ రాహుల్‌‌ (2) వెనుదిరిగాడు. 15/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన కరుణ్‌‌ నాయర్‌‌, జైస్వాల్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్నాడు. గత మ్యాచ్‌‌తో పోలిస్తే లైనప్‌‌లో మూడు ప్లేస్‌‌లు ముందుకొచ్చిన నాయర్‌‌కు ఇంగ్లండ్‌‌ పేసర్లు ఎక్కువగా ఫుల్‌‌ బాల్స్‌‌ వేశారు. అయితే నాయర్‌‌ నెమ్మదిగా కవర్స్‌‌లోకి డ్రైవ్‌‌ చేయడంతో పాటు స్ట్రయిట్‌‌ ఫోర్లు కొట్టాడు. 59 బాల్స్‌‌లో జైస్వాల్‌‌ హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. కానీ లంచ్‌‌కు ఒక ఓవర్‌‌ ముందు కార్స్‌‌ వేసిన ఔట్‌‌ స్వింగర్‌‌.. నాయర్‌‌ బ్యాట్‌‌ ఎడ్జ్‌‌ను తాకుతూ బ్రూక్‌‌ చేతుల్లోకి వెళ్లింది. రెండో వికెట్‌‌కు 80 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇండియా 98/2తో లంచ్‌‌కు వెళ్లింది. 

84 రన్స్‌‌ ఒక్క వికెట్‌‌..

రెండో సెషన్‌‌లో ఇండియా అద్భుతంగా పుంజుకుంది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన జైస్వాల్‌‌కు కెప్టెన్‌‌ గిల్‌‌ అండగా నిలిచాడు. ఈ ఇద్దరు సింగిల్స్‌‌ తీస్తూ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశారు. ఈ క్రమంలో 34వ ఓవర్‌‌లో కార్స్‌‌ వేసిన బ్యాక్‌‌ ఆఫ్ లెంగ్త్‌‌ బాల్‌‌ గిల్‌‌ బ్యాట్‌‌ ఇన్‌‌సైడ్‌‌ ఎడ్జ్‌‌ తాకిందని ఇంగ్లండ్‌‌ బౌలర్లు అప్పీలు చేశారు. కానీ డీఆర్‌‌ఎస్‌‌లో తాకలేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏకైక స్పిన్నర్‌‌ షోయబ్‌‌ బషీర్‌‌ బౌలింగ్‌‌లో ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో భారీ షాట్స్‌‌ ఆడాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న జైస్వాల్‌‌ను 46వ ఓవర్‌‌లో స్టోక్స్‌‌ బోల్తా కొట్టించాడు. షార్ట్‌‌ వైడ్‌‌ డెలివరీని ఆడే క్రమంలో వికెట్‌‌ కీపర్‌‌ జెమీ స్మిత్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్‌‌కు 66 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. సెషన్‌‌ చివర్లో వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ (25) ధనాధన్‌‌ ఆటతో ఆకట్టుకున్నాడు. బషీర్‌‌ బౌలింగ్‌‌లో మిడాన్‌‌లో సిక్స్‌‌ కొట్టాడు. ఈ సెషన్‌‌లో 84 రన్స్‌‌ జత చేసిన ఇండియా 182/3 స్కోరుతో టీ బ్రేక్‌‌కు వెళ్లింది. మూడో సెషన్‌‌లో ఇండియా మరింత మెరుగ్గా ఆడింది. ఇంగ్లిష్‌‌ పేస్‌‌–స్పిన్‌‌ కాంబినేషన్‌‌ను దీటుగా ఎదుర్కొన్న గిల్‌‌ ఇన్నింగ్స్‌‌కు వెన్నెముకగా నిలిచాడు. 125 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌లో పంత్‌‌ వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. సెషన్‌‌ ఏడో ఓవర్‌‌లో బషీర్‌‌ వికెట్‌‌ తీయడంతో నాలుగో వికెట్‌‌కు 47 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. మరో నాలుగు బాల్స్‌‌ తేడాలో నితీశ్‌‌ కుమార్‌‌ రెడ్డి (1) కూడా వెనుదిరిగాడు. దీంతో స్కోరు 211/5గా మారింది. ఈ దశలో వచ్చిన జడేజా సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు. గిల్‌‌కు ఎక్కువగా స్ట్రయికింగ్‌‌ ఇచ్చిన అతను వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. కానీ ఎక్కడా చెత్త షాట్లకు పోకుండా వికెట్‌‌ను కాపాడుకున్నాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌‌కు 99 రన్స్‌‌ జోడించడంతో ఇండియా మంచి స్థితిలో నిలిచింది. స్టోక్స్‌‌, బషీర్‌‌ చెరో వికెట్‌‌ తీశారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 85 ఓవర్లలో 310/5 (గిల్‌‌ 114*, జడేజా 41*, జైస్వాల్‌‌ 87, వోక్స్‌‌ 2/59).