చొప్పదండి, శంకరపట్నం, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో ప్రభుత్వం ఎన్ని హామీలు ఇస్తున్నా.. మిల్లర్లు మళ్లీ 43 కేజీల తూకం వేస్తూ తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై వడ్లు పోసి బైఠాయించారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దొంతిసారపు సంపత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్ని హామీలు ఇస్తున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కాగా ప్రస్తుతం విద్యార్థులకు పోటీ పరీక్షలు ఉన్నందున ఆందోళన విరమించాలని పోలీసులు రైతులను కోరగా.. వారు రైతులు విరమించారు. శంకరపట్నంలో వరంగల్– కరీంనగర్ హైవేపై రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు సెంటర్లో ఏ గ్రేడ్ వడ్లు పంపించినా.. కొనుగోలు సెంటర్ నుంచి కామన్ రకం కింద రాయించుకురావాలని మిల్లర్లు రైతులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్ లీడర్లు తహసీల్దార్ ఆఫీస్లో వినతిపత్రం అందజేశారు.
