
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 17,589 ఎకరాల్లో మిర్చిని రైతులు సాగు చేయనున్నారని అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మిరప, కూరగాయల నారు పెంచే నర్సరీ నిర్వహకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 2వేల కిలోల మిరప విత్తనం నుంచి 20కోట్ల మిరప నారు ఉత్పత్తి అవుతోందన్నారు. జిల్లాలోని నర్సరీల్లో 29కోట్ల నారు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా ఆమోదం పొందిన రకాల నారునే రైతులు కొనుగోలు చేయాలని సూచించారు.
ఓపెన్ ఫీల్డ్లో నారును పెంచవద్దని నర్సరీల నిర్వాహకులకు సూచించారు. లైసెన్స్ లేకుండా మిరప, కూరగాయల నారు పెంచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారు కొనుగోలు చేసే రైతులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలన్నారు. నర్సరీ నియమ నిబంధనలు పాటించని వారితో పాటు నకిలీ విత్తనాలతో నారు పోసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రోగ్రాంలో హార్టి కల్చర్ జిల్లా ఆఫీసర్ జంగ కిశోర్, అధికారులు దేవ ప్రసాద్, మీనాక్షి, స్రవంతి, సాయికృష్ణ , నర్సరీల నిర్వాహకులు పాల్గొన్నారు.