టోల్‌ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ కష్టాలు

టోల్‌ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ కష్టాలు

నేషనల్‌ హైవేలపై టోల్‌ గేట్ల దగ్గర ఫాస్టాగ్‌ విధానం నిన్నటి (ఆదివారం,డిసెంబర్ -15) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీంతో ఈ విధానాన్ని పాటించని వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని టోల్‌గేట్ల దగ్గర ఫాస్టాగ్ లేని వాహనదారులు డబ్బు చెల్లించేందుకు బారులు తీరడంతో రద్దీ ఏర్పడింది. డబ్బు చెల్లించే గేట్ల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ ప్లాజాలలోని ఐదు గేట్ల ద్వారా ఫాస్టాగ్, మూడు గేట్ల ద్వారా నగదు చెల్లించే వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో పంతంగి టోల్ గేట్ దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్టాగ్‌పై వాహనదారులకు సరైన అవగాహన కల్పించలేదంటున్నారు. టోల్ గేట్ల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పాటు… నెమ్మదిగా కదులుతుండటంతో జనాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.