పసిపిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది. వాళ్లు ఎంత అల్లరి చేసినా కొట్టడానికి మనసు రాదు. అదే ఆ బిడ్డల తండ్రికి వాళ్ల పట్ల ఉండే మమకారం, ప్రేమ మాటల్లో చెప్పలేం. కానీ అతడు మాత్రం కన్నబిడ్డలనే కిరాతకంగా హత్య చేశారు. పసిమొగ్గలు అని కూడా చూడకుండా తుపాకీతో కాల్చి చంపేసి, వాళ్ల డెడ్బాడీలను మరో దేశంలో వదిలేసి వచ్చాడు. ఇలా ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నిస్తే ప్రపంచాన్ని కాపాడడానికేనని వింత సమాధానం చెప్పాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.
ప్రపంచానికి ఎందుకు హాని అని అడిగితే..
కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ టేలర్ కోలెమన్ (40) తన ఇద్దరు పిల్లలను పిక్నిక్కి తీసుకెళ్తున్నా అని ఆగస్టు 7న ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అయితే ఆ పిల్లలిద్దరూ ఒకరికి రెండేళ్లు, మరొకరికి 10 నెలలు మాత్రమే వయసు కావడంతో తాను వస్తానని టేలర్ భార్య పట్టుబట్టినా వద్దని చెప్పి వెళ్లిపోయాడు. అతడి కారులో పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లిన టేలర్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. రెండ్రోజులు గడిచినా పిల్లల సమాచారం తెలియకపోవడంతో కంగారు పడిన తల్లి టేలర్పై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేసిన అధికారులు ‘ఫైండ్ మై ఐఫోన్’ యాప్ ద్వారా అతడి లొకేషన్ గుర్తించారు. దేశం దాటిపోయి మెక్సికోలోని రొసారిటోలో ఉన్నట్టు లొకేషన్ చూపించింది. అయితే ఆ ఈ నెల 11వ తేదీన బోర్డర్ దాటి అమెరికాలో ప్రవేశించినట్లు గుర్తించిన ఎఫ్బీఐ అధికారులు వెంటనే అలెర్ట్ అయ్యి, అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నాక ప్రశ్నించగా తన ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి, మెక్సికోలో డెడ్ బాడీలు వదిలేసి వచ్చానని చెప్పాడు. అసలు ఇలా ఎందుకు చేశావని అడిగితే.. ఆ పిల్లల వల్ల ప్రపంచానికి ప్రమాదం ఉందన్నాడు. ఆ సమాధానం విని షాక్ అయిన ఎఫ్డీఐ అధికారులు పసి పిల్లలతో ప్రపంచానికి హాని ఏంటని ప్రశ్నించగా.. వాళ్లలో తల్లి ద్వారా విషపూరిత పాముల డీఎన్ఏ వచ్చిందని, పెద్దయితే రాక్షసులుగా మారుతారని ఏవేవో కాన్స్పిరసీ థియరీలు చెప్పాడు. అయితే అవన్నీ అతడు ఊహించుకున్నవేనని, పిచ్చి ఇల్యూషన్తో పసిపిల్లల్ని చంపేశాడని ఎఫ్బీఐ అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి, అతడిని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. మెక్సికో అధికారుల సహకారంతో పిల్లల మృతదేహాలను వెనక్కి తెప్పించారు.