తండ్రిని సైకిల్‌పై తీసుకెళ్లిన జ్యోతి ఇంట విషాదం

తండ్రిని సైకిల్‌పై తీసుకెళ్లిన జ్యోతి ఇంట విషాదం

ఆరోగ్యం బాగాలేని తన తండ్రిని సైకిల్ మీద 1200 కిలోమీటర్లు తీసుకెళ్లిన జ్యోతి కుమారి.. సోమవారం తన తండ్రిని కోల్పోయింది. జ్యోతికుమారి తండ్రి కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్యం బాగాలేని తన తండ్రిని సైకిల్ మీద కూర్చొపెట్టుకొని 1200 కిలోమీటర్లు తీసుకెళ్లడంతో జ్యోతి కుమారి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగింది. 

బీహార్‌‌లోని దర్బంగాకు చెందిన జ్యోతికుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ గురుగ్రాంలో ఆటో అద్దెకు తీసుకొని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఊహించని రోడ్డు ప్రమాదంలో ఆమె తండ్రి తీవ్రగాయాలపాలయ్యాడు. దానికి తోడు లాక్‌డౌన్ కావడంతో కుటుంబం గడవడం కూడా కష్టమైంది. దాంతో జ్యోతికుమారి ఫ్యామిలీ మొత్తం స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ లాక్‌డౌన్ కావడంతో స్వగ్రామానికి వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో.. జ్యోతికుమారి తన తండ్రిని సైకిల్ మీద కూర్చొపెట్టుకొని ఏడు రోజులపాటు కష్టపడి 1200 కిలోమీటర్ల దూరంలోని దర్బంగాకు చేరుకుంది.

జ్యోతికుమారి తన తండ్రి కోసం చేసిన సాహసం చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. పలువురు ప్రముఖులు జ్యోతికుమారికి చదువు చెప్పిస్తామని, సైకిల్ రేస్ పాల్గొనేలా చేస్తామని, ఆమె కుటుంబానికి ఆర్థికసాయం చేస్తామని.. ఇలా ఎంతోమంది ముందుకొచ్చారు. చివరికి ఈ విషయం అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు.. ఇవాంక ట్రంప్ దృష్టికి కూడా వెళ్లింది. ఇవాంక కూడా జ్యోతి చేసిన సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. “15 ఏళ్ల జ్యోతికుమారి దెబ్బలు తగిలిన తన తండ్రిని వెనక కూర్చోబెట్టుకుని 7 రోజుల పాటు కష్టపడి 1200 కి.మీ. సైకిల్‌ తొక్కి సొంత ఊరికి చేర్చింది. ఓర్పు, ప్రేమ కలిగిన ఈ అందమైన పాదాన్ని సైకిల్‌ ఫెడరేషన్‌ గుర్తించేలా చేసింది” అని ఇవాంక ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.