ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. శనివారం (అక్టోబర్ 25) ఒకే రోజు నాలుగు పశువులను చంపేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గాదేగూడ మండలం కడోడి గ్రామ శివారులో సంచరిస్తుండటంతో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అటవీ అధికారులు.
పెద్దపులి కడోడి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న కారణంగా.. పంటపోలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, సామూహికంగా వెళ్లాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నారు అధికారులు.
మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో చిరుత సంచారం తో జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జీలపల్లి జీపీ పరిధిలోని పర్లపల్లి సమీపంలో గొర్రెల మందపై శనివారం రాత్రి దాడి చేసింది. తెల్లవారుజామున యజమాని వెళ్లేసరికి రెండు గొర్రెలు చనిపోయి ఉన్నాయి.
గొర్లను చంపిన చిరుత ఒక గొర్రెను సమీపంలోని చెట్టుపైకి ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో గొర్రెల యజమాని మేడిపల్లి రామయ్య ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలు గుర్తించి చిరుతగా నిర్ధారించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత దాడితో సమీప గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
