- నేడు యూఎస్తో ఇండియా ఢీ
- రా. 8 నుంచి స్పోర్ట్స్ 18లో
భువనేశ్వర్: ఇండియాలో మరో ప్రతిష్టాత్మక ఫుట్బాల్ సమరం కనువిందు చేయనుంది. ఫిఫా విమెన్స్ అండర్ 17 వరల్డ్ కప్ మంగళవారం మొదలవనుంది. ఇండియా తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలో 20 రోజుల పాటు ఫ్యాన్స్కు కిక్ ఇవ్వనుంది. 16 జట్లు.. నాలుగు గ్రూపుల్లో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మెగా టోర్నీలో తమ సత్తా చూపెట్టి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఆతిథ్య జట్టు హోదాలో ఈ వరల్డ్కప్లో ఇండియా తొలిసారి పోటీ పడుతోంది. మన జట్టుతో పాటు మొరాకో, టాంజానీయా కూడా తొలిసారి బరిలో నిలిచాయి.
గ్రూప్–ఎలో బలమైన యూఎస్ఏ, బ్రెజిల్తో పాటు మొరాకోతో కలిసి ఇండియా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో ఆరంభ ఎడిషన్ (2008) రన్నరప్ అమెరికా జట్టుతో ఇండియా పోటీ పడనుంది. ఎలాంటి అంచనాలు లేని ఆతిథ్య జట్టు అద్భుతం చేస్తే తప్ప బలమైన అమెరికాను ఓడించలేదు. తొలి రోజు మరో మ్యాచ్లో మొరాకోతో బ్రెజిల్ తలపడుతుంది. ఇక, 14న మొరాకో, 17న బ్రెజిల్తో ఇండియా పోటీ పడుతుంది. హెడ్ కోచ్ థామస్ డెనెర్బీ నేతృత్వంలో ఇండియా.. ఇటలీ, నార్వే, స్పెయిన్ టూర్లకు వెళ్లి టోర్నీకి బాగానే సన్నద్ధమైంది. కానీ, బలమైన యూరోపియన్, సౌత్ అమెరికా జట్లతో పోటీ పడలేదు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఇండియా కనీసం ఒక్క విజయం సాధించినా గొప్పే అవుతుంది. కాగా, 2020లోనే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇండియా ఓ ఫిఫా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 2017లో ఫిఫా అండర్ 17 మెన్స్ వరల్డ్కప్ ఇండియాలో జరిగింది.