హాట్ కేకుల్లా అమ్ముడైన ఫిఫా వరల్డ్ కప్ 2022 టికెట్లు

 హాట్ కేకుల్లా అమ్ముడైన ఫిఫా వరల్డ్ కప్ 2022 టికెట్లు

ఫిఫా వరల్డ్ కప్ 2022 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వరల్డ్ కప్ మొదలు కావడానికి ఇంకా 100 రోజులు ఉండగా..అప్పుడే 24.50 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఫిఫా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ టికెట్లను కొనుగోలు చేశారని పేర్కొంది. ముఖ్యంగా ఖతార్, అమెరికా, యూకే, సౌదీ అరేబియా, మెక్సికో, యూఏఈ, ఫ్రాన్స్, అర్జెంటీనా, బ్రెజిల్, జర్మనీ దేశాలకు చెందిన అభిమానులే ఎక్కువగా టికెట్లను కొనుక్కున్నారని వెల్లడించింది. 

ఐదు మ్యాచుల టికెట్లపై ఆసక్తి..
టిక్కెట్ల విక్రయాల చివరి దశలో అంటే జులై 5 నుంచి  ఆగస్టు 16 వరకు 5 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఫిఫా ప్రకటించింది. ఫ్యాన్స్ ఎక్కువగా ఐదు మ్యాచుల టికెట్లను దక్కించుకునేందుకు ఎగబడ్డారని ఫిఫా పేర్కొంది. కామెరూన్ vs బ్రెజిల్, బ్రెజిల్ vs సెర్బియా, పోర్చుగల్ vs ఉరుగ్వే, కోస్టారికా vs జర్మనీ, ఆస్ట్రేలియా vs డెన్మార్క్ మ్యాచుల టికెట్లు విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోయాయని తెలిపింది. 

ఖతార్ ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్
ఫిఫా వరల్డ్ కప్ తర్వాత సేల్ దశ సెప్టెంబర్లో మొదలవనుంది. ఈ సమయంలో మరిన్ని టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.  మిడిల్ ఈస్ట్ ,అరబ్ దేశాల్లో జరుగుతున్న మొట్టమొదటి ఫిఫా వరల్డ్ కప్ కావడంతో..ఈ మ్యాచులను చూసేందుకు అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఇక FIFA ప్రపంచ కప్ నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు జరగనుంది.  మొదటి మ్యాచ్ నవంబర్ 20న ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య జరగనుంది.