న్యూఢిల్లీ : యూజర్లు తరచూ తమ క్రెడిట్ స్కోర్ను చెక్ చేసుకుంటున్నారని మనీవ్యూ సర్వే వెల్లడించింది. సుమారు 88 శాతం మంది ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటున్నారని, వీరిలో 40 శాతం మంది ప్రతీ నెల చెక్ చేసుకుంటున్నారని వివరించింది. తమ క్రెడిట్ స్కోర్ను మెరుగు పరుచుకునేందుకు వివిధ ప్లాట్ఫామ్లు రికమండేషన్స్ ఇస్తున్నాయని సగం మంది రెస్పాండెంట్లు వెల్లడించారు. ఎటువంటి ఖర్చు లేకుండానే క్రెడిట్ స్కోర్ను మెయింటైన్ చేసుకునే టిప్స్ ఇస్తున్నారని చెప్పారు. ఈ సర్వే ప్రకారం, 71 శాతం మంది రెస్పాండెంట్లు రూ.30 వేల నుంచి రూ.2 లక్షల మధ్య లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. ఎవరి నుంచి లోన్ తీసుకోవాలనే అంశంపై వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పాజిటివ్ రేటింగ్ ఎక్కువగా ఉన్న లెండర్ను ఎంచుకుంటామని 26 శాతం మంది, ప్రాసెసింగ్ ఫీజు తక్కువ వసూలు చేసే సంస్థలను ఎంచుకోవాలని 29 శాతం మంది వెల్లడించారు. తక్కువ వడ్డీ ఆఫర్ చేసే వాళ్లకు తమ ఓటు అని 48 శాతం మంది, ఎక్కువ లోన్ అమౌంట్కు ప్రయారిటీ ఇస్తామని 31 శాతం మంది, వెంటనే అప్రూవల్స్ వచ్చే వారి నుంచి అప్పు తీసుకుంటామని 25 శాతం మంది పేర్కొన్నారు. అమౌంట్ను వేగంగా డిస్బర్స్ చేసే లెండర్ నుంచి అప్పు తీసుకుంటామని 21 శాతం మంది, ఆన్లైన్ ప్రాసెస్కు మా పూర్తి ప్రయారిటీ అని 16 శాతం మంది వెల్లడించారు. బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేందుకు లోన్ తీసుకుంటామని 24 శాతం మంది, మెడికల్ ఖర్చుల కోసమని 15 శాతం మంది, ఇంటి నిర్మాణం కోసమని మరో 15 శాతం మంది పేర్కొన్నారు.
