
గుండాల, వెలుగు : నాలుగు ఎకరాల్లోని మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని రోల్లగడ్డ జీపీ నరసాపురంలో మంగళవారం జరిగింది. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మాలోత్ హేమ నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. రెండెకరాల కంకులు విరిచి కుప్పపోయగా, మరో రెండు ఎకరాల్లో పంట అలాగే ఉంది. కాగా తన పొలం పక్కన రైతు మొక్కజొన్న చెత్తకు మంగళవారం మధ్యాహ్నం నిప్పు పెట్టగా, ప్రమాదవశాత్తు అది వచ్చి హేమ పంటకు అంటుకుంది.
స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. చూస్తుండగానే రెండెకరాల్లోని పంటతోపాటు, కుప్పపోసిన మక్క కంకులు సైతం కాలి బూడిదయ్యాయి. రూ.లక్షకు పైగా ఖర్చు చేసి పండించిన పంట అగ్నిపాలైందని బాధిత రైతు కుటుంబం కన్నీరుమున్నీరైంది.