V6 News

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.. కేటీపీపీ బొగ్గు బ్లాక్ లో అగ్నిప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.. కేటీపీపీ బొగ్గు బ్లాక్ లో అగ్నిప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గణపురం మండలం చెల్పూర్ సమీపంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (KTPP) బొగ్గు బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన బొగ్గు కుప్పల నుండి మంటలు ఎగసిపడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ప్లాంట్ ఆవరణలోని రిజెక్ట్ కోల్ అంటే బొగ్గు చూర నిల్వల్లో ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంటలు పుట్టుకొచ్చాయి. బొగ్గు కుప్పల్లో అంతర్గతంగా ఏర్పడిన వేడి వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే ప్లాంట్ పరిసరాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి.మంటల ధాటికి కిలోమీటర్ల మేర నల్లని పొగ ఆకాశాన్ని కప్పేసింది. దీంతో చెల్పూర్ ,సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

►ALSO READ | తెలంగాణ మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సోదాలు..అవినీతి భాగోతం బట్టబయలు

మరో వైపు ఈ అగ్నిప్రమాదం వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు ఇతర బొగ్గు నిల్వలకు లేదా ప్లాంట్ యంత్రాలకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్లాంట్ యాజమాన్యాన్ని స్థానికులు కోరుతున్నారు.