- కరోనా వ్యాప్తి కారణంగా
- జూమ్ యాప్ ద్వారా పార్లమెంట్ సెషన్
కెనడా: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా కెనడా పార్లమెంట్ సమావేశాలు వర్చువల్గా నిర్వహించారు. పార్లమెంట్ హిస్టరీలో ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం ఇదే మొదటి సారని అధికారులు చెప్పారు. సోషల్ డిస్టెంసింగ్ పాటించి, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి మంగళ, గురువారాల్లో 338 మంది కెనడా ఎంపీలు జూమ్ యాప్ ద్వారా మీట్ అయ్యి ప్రజల సమస్యలపై చర్చించారు. “ ఇది చారిత్రాత్మక రోజు” అని స్పీకర్ యాంటోనీ రోటా అన్నారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్షాట్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయొద్దని ఎంపీలకు సూచించారు. “ మేం కరోనా వైరస్ బారిన పడాలనుకోవడం లేదు. సంక్షోభంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మా పార్టీ ఈ ఏర్పాట్లను చేసింది. ప్రజలకు అపాయం కలగకుండా వారి తరఫున ప్రశ్నలు అడగడానికి, ప్రభుత్వం జవాబుదారీగా ఉండేందుకు ఏకైక మార్గం వర్చువల్ పార్లమెంట్ ” అని డెమొక్రాట్ ఎంపీ పీటర్ జూలియన్ చెప్పారు. అయితే కొంత మంది విమర్శకులు మాత్రం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. అధికారిక పార్టీ ప్రతిపక్షాల పాత్రను తగ్గించిందని డెమోక్రసీ వాచ్ సహ వ్యవస్థాపకుడు డఫ్ కోనాచర్ అన్నారు. అయితే ఇలా నిర్వహించడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తెలెత్తాయని కొంత మంది ఎంపీలు అభిప్రాయపడ్డారు. జూమ్ యాప్ సేఫ్ కాదని అన్నారు. రూరల్ ప్రాంతాల్లో ఉన్న కొంత మంది ఎంపీలకు ఇంటర్నెట్ సరిగా లేకపోవడం ఇబ్బందులకు దారి తీసింది. ఫ్రెంచ్ నుంచి ఇంగ్లిష్కు ట్రాన్స్లేట్ చేసేవారికి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు చెప్పారు. ఈ నెల 25 వరకు ఇలానే వర్చువల్ సెషన్స్ నిర్వహించే అవకాశం ఉందని ఒక ఎంపీ చెప్పారు. పార్లమెంట్ను ఎన్హచ్ఎల్ సెనేంటర్స్ హాకీ ఎరేనాకు షిఫ్ట్ చేస్తే సోషల్ డిస్టెంసింగ్ పాటించేందుకు వీలు ఉంటుందని మరికొంత మంది ఎంపీలు చెప్పారు.