కార్పొరేటర్లు చేజారకుండా..! ఇవాళ కేటీఆర్ ఖమ్మం పర్యటన

కార్పొరేటర్లు చేజారకుండా..! ఇవాళ కేటీఆర్ ఖమ్మం పర్యటన
  • సోమవారం ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిక
  • మరికొందరు క్యూలో ఉన్నారని ప్రచారం
  • రంగంలోకి బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ 

ఖమ్మం, వెలుగు:  మున్సిపల్ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీలోని చిక్కుముళ్లను సరి చేసుకోవడంపై బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ దృష్టిపెట్టారు. ఖమ్మం కార్పొరేషన్​ లో పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మేయర్​ సహా పలువురు కార్పొరేటర్లు కారు దిగి, హస్తం గూటికి వెళ్లడంతో మేయర్ పీఠాన్ని చేజార్చుకుంది. ఆ తర్వాత కూడా విడతల వారీగా కొందరు కార్పొరేటర్లు జంప్​ అయ్యారు. తాజాగా సోమవారం ఐదుగురు మహిళా కార్పొరేటర్లు పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.

మరో నలుగురు ఐదుగురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్​ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితిని చక్కబెట్టేందుకు స్వయంగా కేటీఆర్​ రంగంలోకి దిగారు. జంపింగ్ లకు చెక్​ పెట్టడంతో పాటు, కార్పొరేటర్లలో మానసిక స్థైర్యాన్నిచ్చేలా పర్యటన ప్లాన్​ చేశారు. మున్సిపల్​ ఎన్నికలకు ముఖ్య కార్యకర్తలను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఇవాళ కేటీఆర్​ ఖమ్మం వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్​ లను బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో ఆయన సన్మానించనున్నారు.

43 నుంచి 17కి పడిపోయిన కార్పొరేటర్ల బలం..!

2021లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ పార్టీ బంపర్​ మెజార్టీతో గెల్చుకుంది. అప్పటి ఎలక్షన్లలో బీఆర్ఎస్​, సీపీఐ పొత్తుగా పోటీ చేయగా, కాంగ్రెస్​, సీపీఎం జతకట్టాయి. మొత్తం 60 డివిజన్లకు గాను బీఆర్ఎస్​ 43, సీపీఐ 3 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్​ 9, సీపీఎం 2, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్​ నుంచి పునుకొల్లు నీరజ మేయర్​ గా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్​ కార్పొరేటర్లు బీఆర్ఎస్​ లో చేరడంతో పార్టీ బలం 45కు పెరిగింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల కు ముందు నుంచి పరిస్థితి తలకిందులైంది. ఎలక్షన్లకు ముందు డిప్యూటీ మేయర్​ తో పాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్​ లోకి జంప్​ అయ్యారు. ఎలక్షన్ల తర్వాత దశల వారీగా బీఆర్ఎస్​ ను వీడిన కార్పొరేటర్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు జై కొట్టారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు మేయర్​ పునుకొల్లు నీరజతో పాటు మరికొందరు కూడా జంప్​ కావడంతో కార్పొరేషన్​ చేజారింది. తాజాగా సోమవారం కాంగ్రెస్​ లో చేరిన ఐదుగురితో కలుపుకొని కార్పొరేషన్​ లో హస్తం పార్టీ బలం ​39కి పెరగ్గా, ప్రస్తుతం బీఆర్ఎస్​ తో పాటు ఉన్న కార్పొరేటర్ల సంఖ్య 17 తగ్గింది. వీరిలో కూడా మరో నలుగురైదుగురు కాంగ్రెస్​ ముఖ్య నేతలతో టచ్​ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

కేటీఆర్ ముందున్న  సవాల్​ ఇదే.. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​ పూర్తిగా చతికిలబడింది. 10 స్థానాలకు గాను కేవలం భద్రాచలంలో మాత్రమే విజయం సాధించింది. ఆయన కూడా కాంగ్రెస్​ లోకి జంప్​ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఓట్ల శాతాన్ని కోల్పోయింది. మేయర్, మున్సిపల్ చైర్మన్లు పార్టీ మారడంతో ఖమ్మం కార్పొరేషన్​, వైరా మున్సిపాలిటీలనూ చేజార్చుకుంది.

మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 1,035 గ్రామ పంచాయతీలకు గాను పార్టీ మద్దతుదారులు 219 చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత వీరిలో కూడా కొందరు కాంగ్రెస్​ లో చేరారు. వైరాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన మదన్​ లాల్ చనిపోగా, ఆ తర్వాత అక్కడ ఇన్​చార్జిపై ఇంతవరకు స్పష్టత లేదు. భద్రాద్రి జిల్లాలో పలు చోట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జిలకు మధ్య విభేదాలు ఇటీవల బయటపడ్డాయి. ఈ సమస్యలను చక్కదిద్దడంతో పాటు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ కేడర్​ ను సమాయత్తం చేయడం కేటీఆర్​ కు సవాల్ గా మారింది.