- వేగంగా విస్తరిస్తున్న ప్లాట్ఫామ్గా మీషో
- క్విక్ కామర్స్లో దూసుకుపోతున్న బ్లింకిట్: అలియన్స్ బెర్న్స్టెయిన్ రిపోర్ట్
న్యూఢిల్లీ : మనదేశ ఈ–కామర్స్ సెక్టార్లో ఫ్లిప్కార్ట్ హవా కొనసాగుతోంది. వాల్మార్ట్ గ్రూప్కు చెందిన ఈ కంపెనీ 48 మార్కెట్వాటాతో లీడర్గా కొనసాగుతోంది. సాఫ్ట్బ్యాంక్కు వాటాలు ఉన్న మీషో వేగంగా విస్తరిస్తున్న ఈ–కామర్స్ ప్లాట్ఫామ్గా నిలిచింది. ఈ కంపెనీ యూజర్లు వేగంగా పెరుగుతున్నారు. అలియన్స్ బెర్న్ స్టెయిన్ రిపోర్ట్ ప్రకారం, ఫ్లిప్కార్ట్ యూజర్లు 2022–23 లో 21 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగారు. మీషో యూజర్లు 32 శాతం, అమెజాన్ యూజర్లు 13 శాతం వృద్ధి చెందారు. ఫ్లిప్కార్ట్, మీషోతో పోలిస్తే అమెజాన్ కొంత ఎక్కువ ధరకు సర్వీస్లను అందించడం కూడా యూజర్లు తక్కువగా పెరగడానికి కారణం. ‘ 2022–23 నాటికి ఫ్లిప్కార్ట్ మార్కెట్ లీడర్గా నిలిచింది. దేశ ఈ–కామర్స్ సెక్టార్లో 48 శాతం వాటాతో కొనసాగుతోంది. మొత్తం ఇండస్ట్రీ కంటే వేగంగా వృద్ధి చెందుతోంది. కంపెనీ సేల్స్లో మొబైల్ కేటగిరీ వాటా 50 శాతంగా, క్లాత్స్ వాటా 30 శాతంగా ఉంది. ఆన్లైన్లో జరుగుతున్న మొత్తం మొబైల్ ఫోన్ సేల్స్లో ఫ్లిప్కార్ట్ వాటా 48 శాతంగా, క్లాత్స్ సేల్స్లో 60 శాతంగా ఉంది’ అని అలియన్స్ బెర్న్స్టెయిన్ రిపోర్ట్ వివరించింది.
చిన్న సిటీల్లోనూ మీషో
మీషో వేగంగా వృద్ధి చెందడానికి కారణం కంపెనీ టైర్ 2, చిన్న సిటీలపై ఫోకస్ పెట్టడమేనని ఈ రిపోర్ట్ పేర్కొంది. జీరో కమీషన్ మోడల్తో జనాలను ఆకర్షిస్తోందని తెలిపింది. ‘గత 12 నెలల్లో మీషో ఆర్డర్ల వాల్యూమ్ 43 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగింది. రెవెన్యూ 54 శాతం వృద్ధి చెందింది. కొత్త ఆర్డర్లు పెరుగుతున్నాయి. 80 శాతం పాత కస్టమర్లు మళ్లీ ఆర్డర్లు పెట్టడానికి ప్లాట్ఫామ్కు తిరిగొస్తున్నారు’ అని వెల్లడించింది. మీషో ద్వారా 80 శాతానికి పైగా రిటైల్ వ్యాపారాలు తమ ప్రొడక్ట్లను అమ్ముతున్నాయని, 95 శాతం ప్రొడక్ట్లు అన్బ్రాండెండ్ అని అలియన్స్ బెర్న్స్టెయిన్ రిపోర్ట్ పేర్కొంది. ‘దేశ ఈ–కామర్స్ సెక్టార్లో మీషో వేగంగా వృద్ధి చెందుతున్న ప్లాట్ఫామ్గా నిలిచింది. కంపెనీ మంత్లీ యాక్టివ్ యూజర్లు 12 కోట్ల మంది’ అని వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, మీషో గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ) (అమ్ముతున్న గూడ్స్ విలువ) 2022–23 లో 500 కోట్ల డాలర్లుగా ఉంది. ఇందులో 50 శాతం క్లాత్స్ సెగ్మెంట్ నుంచి, మరో 8–10 శాతం వాటా బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ నుంచి ఉన్నాయి. హోమ్ అండ్ కిచెన్ సెగ్మెంట్ నుంచి 8–10 శాతం జీఎంవీ వస్తోంది. ఈ–కామర్స్ యాప్ డౌన్లోడ్స్లో మీషో టాప్లో ఉందని, ఈ కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని రిపోర్ట్ అంచనా వేస్తోంది. దేశంలో అమెజాన్ బ్రాండ్ను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారని నీల్సన్ మీడియా సర్వే కిందటేడాది పేర్కొంది. కానీ, ఈ సర్వేను అమెజాన్ చేయించింది.
క్విక్ కామర్స్లో 3 కంపెనీల హవా
ఫ్యాషన్ ఈ–కామర్స్ సెగ్మెంట్లో రిలయన్స్కు చెందిన అజియో వేగంగా యూజర్లను సంపాదిస్తోంది. మంత్లీ యాక్టివ్ యూజర్ల ప్రకారం చూస్తే కంపెనీ మార్కెట్ షేర్ 30 శాతంగా ఉంది. ఫ్యాషన్ సెగ్మెంట్లో ఫ్లిప్కార్ట్కు చెందిన మింత్రా 50 శాతం మార్కెట్ వాటాతో టాప్లో ఉంది. ‘కిందటి నెలలో మింత్రా 25 శాతం గ్రోత్ రేట్ నమోదు చేసింది. మిగిలిన కంపెనీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయినప్పటికీ యూజర్లు ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేయడం లేదని తెలుస్తోంది. మింత్రా జీఎంవీ 2022–23 లో కేవలం 12 శాతం మాత్రమే పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 35 శాతం వృద్ధి చెందింది’ అని బెర్న్స్టెయిన్ రిపోర్ట్ పేర్కొంది. ఈ– గ్రోసరీ కంపెనీల్లో బ్లింకిట్ వేగంగా విస్తరిస్తోంది. 2021 ఏప్రిల్లో కార్యకలాపాలు మొదలు పెట్టిన జెప్టో మాత్రం బ్లింకిట్ కంటే వెనకబడింది. కంపెనీ ప్రొడక్ట్లు కస్టమర్లను ఆకర్షించలేకపోతున్నాయని తెలిపింది. క్విక్ కామర్స్లో మూడు కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. జీఎంవీ ప్రకారం, బ్లింకిట్ 40 శాతం మార్కెట్ వాటాతో టాప్లో ఉంది. ఇన్స్టామార్ట్ వాటా 37–39 శాతం దగ్గర, జెప్టో మార్కెట్ వాటా 20 శాతం దగ్గర ఉందని వెల్లడించింది.