గ్రేటర్​లో హోటల్​ ఫుడ్​తో జర జాగ్రత్త!

గ్రేటర్​లో హోటల్​ ఫుడ్​తో జర జాగ్రత్త!
  • విచ్చలవిడిగా సింథటిక్ కలర్ వాడకం
  • కెమికల్స్ కలిపిన ఎగ్ మయోన్నైస్ సాస్ తో డెంజర్
  • బయటి తిండి తిని అస్పత్రుల పాలవుతున్న గ్రేటర్ జనం
  • శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు
  • అధికారుల తీరుపై ఇటీవల మేయర్ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హోటల్ ఫుడ్​తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు, అధికారులు. టేస్ట్​, కలర్​కోసం చాలా హోటళ్లలో సింథటిక్​కలర్లు వాడుతుండటంతో ఆ కల్తీ ఫుడ్​ తిని జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా పాడైన ఎగ్ మయోన్నైస్ (ఎగ్​మయో) సాస్ తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. తాజాగా గ్రేటర్​లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసుల్లో ఇలాంటివే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా హోటళ్లలో కలర్, టేస్ట్ కోసం ఎగ్ మయోలో ప్రమాదకర కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. అసలు నిల్వ ఉంచకూడని ఈ ఎగ్​మయోని కొన్ని హోటళ్లలో తర్వాతి రోజుల్లో కూడా వడ్డిస్తుండటంతో.. అది తిన్న జనం ఫుడ్ పాయిజన్​కి గురతున్నారు.  ఇలాంటి పదార్థాలు కిడ్నీలో ఫిల్టర్ సరిగా కాకపోవడంతో కిడ్నీ సమస్యలు కూడా ఏర్పడే ప్రమాదం ఉందని, బాడీలో కొవ్వు పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. క్యాన్సర్, ఎసిడిటీ లాంటి సమస్యలు ప్రస్తుతం కొన్ని మినహా అనేక హోటల్స్, రెస్టారెంట్లలో అన్ని రకాల ఫుడ్ తయారీలో ప్రమాదకర సింథటిక్ కలర్లు వాడుతున్నారు. బిర్యానీ నుంచి మొదలు ఫ్రైడ్​రైస్​లలోనూ విచ్చలవిడిగా కలర్లు వేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా క్వాలిటీ లేకుండానే ఫుడ్ సర్వ్ అవుతోంది. ఈ సింథటిక్ కలర్ల వల్ల క్యాన్సర్​తో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ తదితర సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు వహించాలని, హోటళ్లలోని ఫుడ్​పై అనుమానం వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలంటున్నారు.

వరుసగా ఫుడ్ పాయిజన్  కేసులు

గ్రేటర్​లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలోనే  మల్కాజిగిరిలోని ఓ హోటల్​లో ఫుడ్ తిన్న కొందరు ఆస్పత్రి పాలయ్యారు. అక్కడే ఉన్న మరో హోటల్​లోనూ ఇలాగే జరిగింది. తాజాగా సనత్​నగర్​లోని ఓ మండి రెస్టారెంట్​లో తిన్న 15 మంది అనారోగ్యానికి గురై హాస్పిటల్​లో చేరారు. కొందరు ఇప్పటికీ ఐసీయూలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. నాన్​వెజ్​ఐటమ్స్​కి టేస్టుని అందించే ఎగ్ మయో తిన్నవారే అనారోగ్యానికి గురయ్యారు. ఇలా ఈ ఒక్క నెలలోనే 50 మందికిగా సిటిజన్లు ఆస్పత్రుల పాలయ్యారు. బిర్యానీలో కలర్లు కలుపుతున్న 20కిపైగా హోటల్స్, రెస్టారెంట్లకు బల్దియా ఫుడ్​సేఫ్టీ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. తాజాగా లంగర్​హౌస్​లోని సురభి హోటల్​పై దాడులు జరిపిన అధికారులు ప్రమాకరమైన కలర్లు వాడుతున్నారని గుర్తించారు. శ్యాంపిల్స్​ను ల్యాబ్ కు పంపి చెక్ చేయగా ఈ ఫుడ్ ప్రమాదకరమని తేలింది.

మేయర్ ఫైర్..

అయితే, ఘటనలు జరిగినప్పుడు హడావుడిగా హోటళ్లు, రెస్టారెంట్లను అధికారులు బంద్ చేయిస్తున్నప్పటికీ రాజకీయ నేతల ప్రమేయంతో తిరిగి వెంటనే ఓపెన్ అవుతున్నాయి. మెడికల్ ఆఫీసర్లతో కలిసి పనిచేయాల్సిన ఫుడ్​సేఫ్టీ అధికారులు వారిని పట్టించుకోవడం లేదు. హెల్త్ అండ్ శానిటేషన్ లో ఫుడ్ సేఫ్టీ వింగ్ ఒక  భాగమైనప్పటికీ జీహెచ్ఎంసీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్​సేఫ్టీ అధికారులపై ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఫైర్ అయ్యారు. గ్రేటర్ లో కల్తీ ఆహారం విచ్చలవిడిగా సర్వ్​అవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఆ ఫుడ్​ తిని జనం ఆస్పత్రుల పాలవుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా పనితీరును మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

కెమికల్స్ తో అనారోగ్యాలు

నేచురల్ గా తయారుచేసే ఎగ్ మయో శరీరానికి చాలా ప్రొటీన్స్ ను ఇస్తుంది. కానీ కమర్షియల్ పర్పస్​లో వాడేందుకు దానిలో కలర్లు, కెమికల్స్ కలిపి నిల్వ ఉంచుతున్నారు. మరుసటి రోజు దాన్ని ఇతర ఫుడ్ ఐటమ్స్ లో వాడటం వల్ల అది తిన్న జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలాంటి పదార్థాలు సరిగా ఫిల్టర్ కాకపోవడంతో కిడ్నీ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.  
–డాక్టర్ విజయ భాస్కర్, ఎథిక్స్​కమిటీ చైర్మన్, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్

అవేర్ నెస్ కల్పిస్తున్నం

నిల్వ చేసిన ఫుడ్​ను సర్వ్ చేస్తే పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్ మయో ఎలా తయారు చేస్తున్నారనే దానిపై కూడా ఫోకస్ పెట్టాం. వాడిన పాత్రలు కడగకుండా వాటిలోనే మళ్లీ వండటం, వాడిన నూనె మళ్లీ వాడటంతో కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కలర్లు కూడా ఎక్కువగా వాడుతున్నరు. ఇప్పటికే చాలా చోట్లు తనిఖీలు చేసి కేసులు కూడా నమోదు చేశాం. హోటల్స్, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నం.
–సుదర్శన్ రెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్, జీహెచ్ఎంసీ