- 25 మంది స్టూడెంట్స్కు అస్వస్థత
- ఉడకని బజ్జీలు తినడం వల్లే ఘటన
- కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో దవాఖానకు..
- డిశ్చార్చి అయ్యాక మళ్లీ అడ్మిట్ అయిన ఆరుగురు
- బయటకు తెలియనివ్వని అధికారులు
సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలోని శాస్త్రి నగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5వ తరగతి నుంచి ఇంటర్వరకు చదువుతున్న సుమారు 371 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇందులో 25 మంది తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో అల్లాడిపోయారు. దీంతో వీరిని సుల్తానాబాద్ దవాఖానలో చేర్పించారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు.
అయితే, గురుకులానికి వచ్చిన వారిని అబ్జర్వేషన్ లో పెట్టగా, మరికొంతమందిని తల్లిదండ్రులు ఇండ్లకు తీసుకువెళ్లారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఆరుగురు విద్యార్థులు మళ్లీ హాస్పిటల్లో అడ్మిట్అయ్యారు. గురువారం ఉదయం సరిగ్గా ఉడకని బజ్జీలు పెట్టారని, ఆయిల్ కూడా ఎక్కువగా ఉండడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు.
ఘటన బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, కొందరు పేరెంట్స్ ఇచ్చిన సమాచారంతో వెలుగులోకి వచ్చింది. గురుకుల విద్యాలయాల రీజినల్ కో ఆర్డినేటర్ మేరీ యేసు పాదం హాస్టల్ను విజిట్ చేశారు. పరిస్థితి అదుపులో ఉందని, అందరూ బాగానే ఉన్నారని ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ రాజ్ తెలిపారు.