హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఆసియా గేమ్స్లో పాల్గొననుంది. వచ్చే నెల 23 నుంచి చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా గేమ్స్లో పోటీ పడే ఇండియా విమెన్స్ టీమ్లో సౌమ్య చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి నేషనల్ టీమ్కు ఎంపికైన ఏకైక మహిళా ప్లేయర్ ఆమెనే కావడం విశేషం.
చీలమండ గాయం నుంచి కోలుకున్న తర్వాత సౌమ్య సూపర్ పెర్ఫామెన్స్తో మళ్లీ నేషనల్ టీమ్లోకి వచ్చింది. కాగా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) తరఫున సౌమ్యకు రూ. 5 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2021లో ఇచ్చిన హామీని నేటికీ నిలబెట్టుకోలేదని తెలంగాణ ఫుట్బాల్ సంఘం సెక్రటరీ జీపీ పాల్గుణ గుర్తు చేశారు. గిరిజన వర్గానికి చెందిన సౌమ్య ఆర్థికంగా వెనుకబడి ఉందని, వీలైనంత త్వరగా ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని శాట్స్, క్రీడా మంత్రిని కోరారు.