న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు కలిపి 40.82 కోట్ల మంది బెనిఫిషియరీలకు మొత్తం రూ. 23.20 లక్షల కోట్ల అప్పులను ముద్రా యోజనా కింద ఇచ్చాయి. వ్యాపారం చేయడానికి డబ్బు లేక, దొరక్క ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ ముద్రా యోజనా స్కీమును 8 ఏళ్ల కిందట అమలులోకి తెచ్చారు. ప్రధాన మంత్రి ముద్రా యోజనా (పీఎంఎంవై) పేరుతో ఏప్రిల్8, 2015 నాడు నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ స్కీమును లాంఛ్ చేశారు.
ఎలాంటి కొలేటరల్ లేకుండా రూ. 10 లక్షల దాకా అప్పును చిన్న వ్యాపారులకు ఇవ్వడంపై ఈ స్కీమ్ ఫోకస్ పెట్టింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మైక్రోఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఫైనాన్సియల్ ఇంటర్మీడియరీలు పీఎంఎంవై స్కీము కింద ముద్రా లోన్లను ఇస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ శనివారం ఒక స్టేట్మెంట్లో వెల్లడించింది. స్కీము కింద 68 శాతం మహిళా వ్యాపారుల పేరు మీదే అకౌంట్లు ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. 51 శాతం లోన్ అకౌంట్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలలోని వ్యాపారులకు చెందినవని పేర్కొన్నారు.
ఈ చొరవ వల్ల ఇన్నోవేషన్ పెరగడంతోపాటు, తలసరి ఆదాయం నిలకడగా ఎగసిందని అన్నారు. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్లో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర పోషించాయని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.