కరోనా నుంచి కోలుకున్నోళ్లకు  బ్లాక్‌‌ ఫంగస్‌‌ ముప్పు

కరోనా నుంచి కోలుకున్నోళ్లకు  బ్లాక్‌‌ ఫంగస్‌‌ ముప్పు

సూరత్‌‌లో రెండు వారాల్లో 40 మందిలో గుర్తింపు
న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్‌‌ ఫంగస్‌‌ (మ్యుకోర్‌‌మైకోసిస్‌‌) ఇన్ఫెక్షన్‌‌ భయపెడుతోంది. గుజరాత్‌‌, అహ్మదాబాద్‌‌, ఢిల్లీల్లో ఈ కేసులు కనబడుతున్నాయి. గత 15 రోజుల్లో సూరత్‌‌లో 40 మందికి ఈ ఫంగస్‌‌ సోకగా 8 మందికి కంటిచూపు పోయింది. ఢిల్లీలోని గంగారామ్‌‌ ఆస్పత్రిలోనూ ఇలాంటి కేసులను ఈ రెండ్రోజుల్లో 6 గుర్తించినట్టు డాక్టర్లు చెప్పారు.   
ఏంటీ ఫంగస్‌‌?
బ్లాక్‌‌ ఫంగస్‌‌ అనేది మనుషులకు అరుదుగా సోకే ఫంగల్‌‌ ఇన్ఫెక్షన్‌‌. వాతావరణంలో అరుదుగానే ఉంటుంది. కరోనా సోకిన వారికి, వేరే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి, స్టెరాయిడ్స్‌‌ బాగా వాడే వారికి ఇది సోకే చాన్స్‌‌ ఎక్కువ. ఐసీయూ ట్రీట్‌‌మెంట్‌‌, ఆర్గాన్‌‌ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌ జరిగిన వారికీ దీని వల్ల ముప్పు ఎక్కువే. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్‌‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌‌లో చేరుతుంది. కొన్ని సందర్భాల్లో శరీరానికైన గాయాల నుంచి కూడా బాడీలోకి చేరుతుంది.  
లక్షణాలేంటి?
కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడ్రోజుల్లో బ్లాక్‌‌ ఫంగస్‌‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్‌‌లో చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్‌‌ వరకు వెళ్తుంది. ఇది సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. తీవ్రమైన డయాబెటిస్‌‌తో ఇబ్బంది పడుతున్న వారు కోలుకునేందుకు డాక్టర్లు స్టెరాయిడ్స్‌‌ ఇస్తున్నారని, వీరిలో ఈ ఇన్ఫెక్షన్‌‌ ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.  
ట్రీట్‌‌మెంట్‌‌ ఏంటి?
బ్లాక్‌‌ ఫంగస్‌‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని సైంటిస్టులు చెప్పారు. ముందే గుర్తించి యాంటీఫంగల్‌‌ ట్రీట్‌‌మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చన్నారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో యాఫోటెరిసన్‌‌ బీ వంటి యాంటీ ఫంగల్‌‌ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడతారు.