
మంచిర్యాల/చెన్నూర్,వెలుగు: చెన్నూర్మండలం ఓత్కులపల్లి శివారులోని 730 సర్వేనంబర్లో గ్రామానికి చెందిన పలువురు రైతులు నలభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. సుమారు 50 ఎకరాలకు1998లో అప్పటి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు జారీ చేసింది. అప్పటి నుంచి రైతులు పంటలు పండించుకుంటున్నారు. తాతలు తండ్రుల కాలం నుంచి ఆ భూములపైనే ఆధారపడి బతుకుతున్నారు. 2013లో ఫారెస్ట్ ఆఫీసర్లు మీరు అడవిని నరికి సాగు చేసుకుంటున్నారని 14 మంది రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆ తర్వాత కూడా అదే భూమిలో పట్టా ఉన్న రైతులు సాగు చేసుకుంటున్నారు. నిరుడు వానాకాలం సీజన్లో సైతం పత్తి పంట వేశారు.
పంటకాలం పూర్తికాగానే మార్చిలో ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీస్ ఫోర్స్, రెవెన్యూ ఆఫీసర్ల సహాయంతో వచ్చి భూములను స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలతో ట్రెంచ్కొట్టారు. అడ్డుకోబోయిన రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. మళ్లీ ఈ భూముల్లో అడుగుపెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మల్లీ జైలుకు పంపుతామని హెచ్చరించారు. వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి సదరు భూముల్లో మొక్కలు నాటుతున్నారు. మరోవైపు ఫారెస్ట్ ఆఫీసర్లు భూములను గుంజుకోవడంతో తమకు బతుకుదెరువు కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1998లో ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు, తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన పట్టా పాస్బుక్లు ఉన్నాయని, వాటిపై బ్యాంకుల్లో క్రాప్ లోన్లు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు, ఎఫ్డీవోకు పలుమార్లు కలిసినా ఫలితం లేదని చెప్తున్నారు. పట్టా పాస్బుక్లో ఉన్న సర్వే నంబర్లలోని భూమిని మాకు చూపించి మీరు ఏమైనా చేసుకోండని అధికారుల కాళ్లావేళ్లా పడ్డా ఏమాత్రం కనికరం చూపకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
జాయింట్ సర్వేతోనే క్లారిటీ...
గతంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. కొన్నిచోట్ల ఫారెస్ట్ భూముల్లో పట్టాలు ఇచ్చారని ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వాదిస్తున్నారు. రైతులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పటికీ హద్దులు చూపించకపోవడంతో సమస్య తలెత్తింది. చెన్నూర్మండలంలోని ఓత్కులపల్లితో పాటు చాకెపల్లి, అస్నాద్గ్రామాల్లో రెవెన్యూ, ఫారెస్ట్ భూములకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. జాయింట్సర్వే చేసి వివాదాలను పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు మూడేండ్లుగా చెప్తున్నారు తప్ప సర్వే ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించి జాయింట్ సర్వే పెండింగ్ఉన్నట్టు సమాచారం. జాయింట్ సర్వే నిర్వహిస్తే తప్ప రెవెన్యూ, ఫారెస్ట్ భూ వివాదాలకు తెరపడే ఆస్కారం లేదు.