కరోనా తీవ్రమైతే మతిమరుపు

కరోనా తీవ్రమైతే మతిమరుపు

వాషింగ్టన్: కరోనా తీవ్రమై హాస్పిటల్​లో ఎక్కువ కాలం ట్రీట్​మెంట్​ తీసుకున్న పేషెంట్లకు రకరకాల రోగాలొస్తున్నాయి. ఐసీయూలో చేరిన వాళ్లలో మతిమరుపు సమస్య కూడా గుర్తించినట్టు తాజాగా సైంటిస్టులు వెల్లడించారు.  అమెరికాలో 2020 మార్చి నుంచి 2020 మే వరకు హాస్పిటళ్లలో చేరిన 150 మంది పేషెంట్లపై పరిశోధన చేసి ఈ విషయం కనుగొన్నామన్నారు. వీళ్లలో 73 శాతం మందిలో మతిమరుపు లక్షణాలు గుర్తించామని వివరించారు. కరోనాతో తీవ్రంగా ఎఫెక్టయిన పేషెంట్ల మెదడుకు ఆక్సిజన్​ తగ్గి బ్లడ్​ క్లాట్స్​ ఏర్పడి స్ట్రోక్స్​ వచ్చే ప్రమాదమున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మతిమరుపుకు సంబంధించి తీవ్రమైన సమస్యలు వస్తాయన్నారు.

మెదడు వాపు పెరిగి కన్ఫ్యూజన్, ఆందోళన పెరుగుతాయన్నారు. ఇదే విషయంపై ఐసీయూలో పని చేసే నర్సులతో మాట్లాడగా.. తీవ్రమైన కరోనా లక్షణాలున్న పేషెంట్లు మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడేవారని, ఆందోళన చెందేవారని, దీంతో వాళ్లకు మత్తు మందు ఇవ్వాల్సి వచ్చేదని చెప్పారన్నారు. డిశ్చార్జ్​ అయినంక కూడా మతిమరుపు సమస్య ఉంటుందని, కొంతమంది కొన్ని నెలల వరకు ఇబ్బంది పడాల్సిందేనని చెప్పారు. పేషెంట్లతో కుటుంబీకులు మాట్లాడేలా అవకాశం కల్పించడం, వీడియో కాల్స్, ఫొటోలు, వస్తువులను ఇంటి నుంచి తెప్పించడం లాంటివి చేస్తే మతిమరుపును దరిచేరకుండా ఆపొచ్చన్నారు.