డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కమీషన్ ఇవ్వకుంటే ఏ పనీ జరగదని బీజేపీ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ రాష్ట్రంలో ‘కమీషన్ ఖోరి’ గురించి మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
‘నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. బహుశా ఇలాంటివి చెప్పకూడదేమో. కానీ, ఉత్తరాఖండ్లో కమీషన్లు ఉన్నాయని నిస్సందేహంగా అంగీకరిస్తాను. మా రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు ప్రజా పనులు జరగాలంటే 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వచ్చేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అవి తగ్గాల్సి ఉండే. కానీ, ఆ ప్రాక్టీస్ ఇంకా కొనసాగడమే కాకుండా కమీషన్లు 20 శాతం నుంచి మొదలయ్యాయి. దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేము. మన రాష్ట్రాన్ని మనం సొంత కుటుంబంలా చూసినప్పుడే ఇది ఆగిపోతుంది..’ అని వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు.
సొంత పార్టీ ప్రభుత్వంపై రావత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. కిందటేడాది మార్చిలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో యువతులు ధరించే చిరిగిన జీన్స్పై ట్విట్టర్లో కామెంట్చేసి వివాదంలో చిక్కుకున్నారు.