
- అంచనా వ్యయం 82 వేల కోట్ల నుంచి ఎందుకు పెంచారో తెల్వదు
- కేబినెట్ కు బాస్ కేసీఆర్.. కేబినెట్ అప్రూవల్ మేరకే రీ డిజైనింగ్
- ప్రాజెక్టు ఎక్కడ కట్టాలన్నది ఆర్థికశాఖకు సంబంధం లేదు
- మంత్రి వర్గం ఆమోదంతోనే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం నిర్మాణం
- టెక్నికల్ టీమ్, ఎక్స్పర్ట్ కమిటీల సూచన మేరకే ప్రాజెక్టు షిప్ట్ చేశాం
- బడ్జెట్ సరిపోదనే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్లు తీసుకున్నం
- కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసినట్టు మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కేబినెట్ కు బాస్ కేసీఆర్ అని.. ఆయన సూచన మేరకే కేబినెట్ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఆయన ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కమిషన్ మొదట నిజమే చెబుతానని ఈటల తో ప్రమాణం చేయించింది. అనంతరం విచారణ ప్రారంభించింది.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారని ప్రశ్నించగా.. 2014 జూన్ నుంచి 2018 డిసెంబర్ 18 వరకు పని చేశానని చెప్పారు. కాళేశ్వరం మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం నిర్మాణం ఎవరు నిర్ణయం తీసుకున్నారని అడగగా.. కేబినెట్ లో నిర్ణయం తోనే నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ప్రాజెక్టు షిప్టింగ్, రీ డిజైనింగ్ పై కమిషన్ ప్రశ్నించగా.. టెక్నికల్ టీమ్, ఎక్స్పర్ట్ కమిటీ ల సూచన మేరకే షిప్ట్ చేసినట్టు తెలిపారు.
తుమ్మల, ఈటల, హరీశ్ రావులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కేబినెట్ అప్రూవ్ తర్వాత రీ డీజైనింగ్ చేసినట్టు సమాధాన మిచ్చారు. ఎక్కడ కట్టాలన్నది ఆర్థిక శాఖకు సంబంధం లేని విషయమని చె9ప్పారు. బడ్జెట్ పై అడిగిన ప్రశ్నలకు.. కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ మొదట రూ. 60 వేల కోట్లకు, ఆ తర్వాత రూ. 83 వేల కోట్లకు పెంచారని, ప్రస్తుతం ఎంత అయిందో తెలియదని ఆన్సర్ ఇచ్చారు.
డీపీఆర్ తయారీ కోసం వ్యాప్కోస్ సంస్థకు 594.45 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా ? అన్న ప్రశ్నకు తనకుకు తెలియదని ఆన్సర్ ఇచ్చారు.