సంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ కు పట్టడం లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ విమర్శించారు. వానలకు పంటలు నష్టపోయినా పట్టించుకోకుండా.. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేయడానికి వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజాగోస - బీజేపీ భరోసా బైక్ యాత్ర రెండో రోజు కార్యక్రమాల్లో బాబు మోహన్ పాల్గొన్నారు.
కంది మండలం ఉత్తర్ పల్లి నుంచి 12 గ్రామాల్లో యాత్ర కొనసాగింది. బైక్ యాత్రలో జిల్లా నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లోని మహిళలతో బాబు మోహన్ మాట్లాడారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఏమేం వాగ్దానాలు చేశారో గుర్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కార్ పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నదని బాబు మోహన్ వివరించారు.