
యాదాద్రి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన నాయకులను వదిలి పెట్టేది లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్షకోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు. భువనగిరిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ లీడర్లకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు.
కేటీఆర్ నోరు తెరిస్తే బూతులే వస్తున్నాయని తెలిపారు. అవసరమైన యూరియాను సప్లయ్ చేస్తున్నా.. దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దొడ్డిదారిలో ఇండస్ట్రీలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాశీం రిజ్వికి కేవలం ఏడేండ్ల జైలు శిక్ష పడేలా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
చివరకు పాకిస్థాన్కు సాగనంపారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయా దశరథ, పాశం భాస్కర్, చందా మహేందర్ గుప్తా, పడమటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.