ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రిమాండ్ ను స్పెషల్ కోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 13 వరకు ఇమ్రాన్ ను జ్యుడీషియల్ రిమాండ్ లోనే ఉంచాలని అధికారులను ఆదేశించింది. అధికార రహస్యాల వెల్లడికి సంబంధించిన కేసులో ఇమ్రాన్ ను స్పెషల్ కోర్ట్ జడ్జి అబ్దుల్ హస్నత్ జుల్కర్ నైన్.. అట్టోక్ జిల్లా జైలులో బుధవారం విచారించారు. న్యాయ శాఖ అనుమతివ్వడంతో జైల్లో ఇమ్రాన్ ను పటిష్ట భద్రత మధ్య ప్రశ్నించారు.
ఇమ్రాన్ తరపున వాదనలు వినిపించేందుకు ముగ్గురు అడ్వొకేట్లను అనుమతించారు. వాదనలు విన్న తర్వాత ఇమ్రాన్ కు వచ్చే నెల 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నామని జడ్జి జుల్కర్ నైన్ తెలిపారు. కాగా, తాను ప్రధానిగా ఉన్నపుడు ఇమ్రాన్ ఓ ర్యాలీలో ప్రభుత్వానికి సంబంధించిన ఓ రహస్య డాక్యుమెంట్ల వివరాలను గట్టిగా చదివి వినిపించారు. దీంతో ఆయనపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద సైఫర్ కేసు నమోదైంది.