నవాజ్ షరీఫ్ వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన బ్రిటన్

నవాజ్ షరీఫ్ వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన బ్రిటన్

పాకిస్తాన్ లో అవినీతి ఆరోపణలపై జైలుశిక్షకు గురైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (71) చికిత్స పేరుతో లండన్ లో కాలం గడుపుతున్నారు. అయితే.. తన వీసా పొడిగించాలంటూ నవాజ్ షరీఫ్ చేసుకున్న దరఖాస్తును బ్రిటన్ ప్రభుత్వం లేటెస్టుగా తిరస్కరించింది. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ తేల్చి చెప్పింది.

విదేశీయులు బ్రిటన్ లో ఆర్నెళ్లకు మించి ఉండేందుకు అక్కడి చట్టాలు అనుమతించవు. అయితే ఆరోగ్య కారణాలపై పాక్ ను వీడిన నవాజ్ షరీఫ్... తన వీసాలను అనేక దఫాలుగా పొడిగించుకుంటూ లండన్ లోనే ఉంటున్నారు. అయితే ఈసారి బ్రిటన్ ప్రభుత్వం షరీఫ్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీనిపై ఆయన ప్రతినిధి స్పందిస్తూ, ఇమ్మిగ్రేషన్ ట్రైబ్యునల్ లో అప్పీల్ చేస్తామని తెలిపారు. 

అవినీతి కేసుల్లో ఆరోపణలు నిరూపితం కావడంతో నవాజ్ ఫరీష్ కు పాక్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. 2018లో ఈ తీర్పు వచ్చింది. ఆయన కొన్నాళ్ల పాటు లాహోర్ జైల్లో కూడా ఉన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ అప్పట్లో షరీఫ్ ను ఎయిర్  అంబులెన్స్ లో లండన్ తరలించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే షరీఫ్ లండన్ వీధుల్లో చలాకీగా తిరుగుతూ, రెస్టారెంట్లలో కన్పించడం అనేక సందేహాలకు తావిచ్చింది.